టర్కీలో తెలంగాణ ఐఏఎస్ కుమారుడి దారుణ హత్య..
హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశాంక్ గోయల్ కుమారుడు శుభమ్ గోయల్(24) టర్కీలోని ఇస్తాంబుల్ లో దారుణ హత్యకు గురయ్యాడు. దోపిడీ దొంగలు అతనిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది.
మే 24న ఈ ఘటన జరగ్గా.. శనివారం అతని మృతదేహాన్ని ఉత్తరాఖండ్ లోని స్వగ్రామమైన రూర్కీకి తీసుకొచ్చారు. ఆదివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుమారుడి మృతితో గోయల్ ఇంట తీవ్ర విషాదం అలుముకుంది. కాగా, యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న శుభమ్ ఫ్రెండ్తో హాలీడే ట్రిప్ కోసం ఇస్తాంబుల్ వెళ్లాడు.
నిజానికి ఏప్రిల్ 28న శుభమ్ ఇండియాలోనే ఉన్నాడు. బంధువుల పెళ్లి కోసం అమెరికా నుంచి వచ్చాడు. అది పూర్తవగానే తిరిగి కాలిఫోర్నియా బయలుదేరాల్సి ఉంది. అయితే ప్రయాణం వాయిదా పడటంతో అతడి ఫ్రెండ్ సుధాన్షుతో కలిసి టర్కీ బయలుదేరాడు. ఇస్తాంబుల్ వెళ్లాక దోపిడీ దొంగలు శుభమ్ పై దాడికి పాల్పడ్డారు. దుండగులు డబ్బు ఇవ్వాల్సిందిగా శుభమ్ ను డిమాండ్ చేయగా.. అందుకు అతను నిరాకరించడంతో అతనిపై దాడికి దిగారు. కత్తితో పొడిచి అనంతరం గన్తో కాల్చి చంపారు.
కుమారుడి హత్య గురించి తెలిసిన వెంటనే శశాంక్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అక్కడ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో మాట్లాడి తన కొడుకు మృతదేహాన్ని భారత్కు రప్పించేందుకు ఏర్పాటు చేశారు. శనివారం శుభమ్ మృతదేహం ఢిల్లీకి చేరుకోగా.. వెంటనే అక్కడి నుంచి శశాంక్ స్వగ్రామం రూర్కీకి తరలించారు.