కరోనా : తెలంగాణలో ఎంతమంది ఢిల్లీ మర్కజ్కి వెళ్లొచ్చారు.. ఏ జిల్లాలో ఎందరు..?
ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ ప్రార్థనా మందిరం ప్రస్తుతం భారత్లో కరోనా వ్యాప్తికి కొత్త ఎపి సెంటర్గా మారింది. దాదాపు నెల రోజులు మార్చి 15 వరకు ఇక్కడ జరిగిన మత ప్రార్థనల్లో దేశవ్యాప్తంగా 2వేల పైచిలుకు మంది పాల్గొన్నట్టు చెబుతున్నారు. అయితే కచ్చితంగా ఎంతమంది పాల్గొన్నారన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. నెల రోజుల పాటు సాగిన ప్రార్థనల కార్యక్రమానికి.. దేశం నలుమూల ఎంతోమంది హాజరవగా.. చివరి రోజుల్లో ఇక్కడికి వచ్చినవారిలో ఎక్కువమందికి పాజిటివ్గా తేలింది.
లాక్ డౌన్ తర్వాత వందల మంది ఇక్కడే చిక్కుకుపోవడంతో.. తాజాగా వారందరనీ క్వారెంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో చోటు చేసుకున్న కరోనా మరణాలకు కూడా మూలాలు ఇక్కడే ఉన్నట్టు తేలడం కలకలం రేపుతోంది.
తెలంగాణలో ఎంతమంది..
ఢిల్లీలోని మర్కజ్ మసీదులో జరిగిన ప్రార్థనలకు తెలంగాణ నుంచి దాదాపు 1030 మంది వెళ్లినట్టు ప్రభుత్వం గుర్తించింది. వీరిలో హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధికి చెందిన 603 మంది గుర్తించింది. అలాగే నిజామాబాద్లో 80, నల్లగొండ 45, వరంగల్ అర్బన్ 38, ఆదిలాబాద్ 30, ఖమ్మం 27, నిర్మల్ 25, సంగారెడ్డిలో 22,మహబూబ్ నగర్ 25 మంది ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్టు గుర్తించింది. మిగతావాళ్లు ఆయా జిల్లాల్లో తమ స్వస్థలాల్లో ఉన్నట్టు గుర్తించింది. వీరందరు స్వచ్చందంగా సమీప ఆసుపత్రులు లేదా అధికారులకు వివరాలు తెలియజేయాలని ప్రభుత్వం కోరుతోంది.
ఢిల్లీ నుంచి కోరుట్లకు 32 మంది.. జగిత్యాలకు తరలింపు
మంగళవారం ఉదయం తెలంగాణ,మహారాష్ట్ర సరిహద్దులో 32 మంది కోరుట్ల వాసులను పోలీసులు పట్టుకున్నారు. వీరంతా ఢిల్లీలో మర్కజ్ మసీదులో ప్రార్థనలకు హాజరై తిరిగి వస్తున్నట్టుగా గుర్తించారు. దీంతో వారిని అక్కడే నిలిపివేసి.. వేరే వాహనంలో జగిత్యాలకు తరలించారు. గ్రామాలకు టచ్ అవకుండా జాతీయ రహదారి వెంబడి వారిని జగిత్యాల క్వారెంటైన్ కేంద్రాలకు తరలించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శాంతి నగర్,వడ్డేపల్లి నుంచి మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారిని గుర్తించారు. అలాగే వనపర్తిలోనూ వారిని గుర్తించి క్వారెంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. తెలంగాణ నుంచి మొత్తం 1030 మంది మర్కజ్కి వెళ్లినట్టు తేలడంతో.. వీరి ట్రావెల్ హిస్టరీని మొత్తం బయటకు తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
తెలంగాణలో 77 పాజిటివ్ కేసులు.. ఆరుగురు మృతి..
తెలంగాణలో కరోనా కారణంగా మృతి చెందిన ఆరుగురికి ఢిల్లీ మర్కజ్లోనే మూలాలున్నాయి. వీరిలో ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో,ఒకరు అపోలో,మరొకరు గ్లోబల్లో ఆసుపత్రిలో మృతి చెందారు. మరో ఇద్దరు నిజామాబాద్,గద్వాలలో మృతి చెందారు. ఇటీవల ఖైరతాబాద్లో మృతి చెందిన వృద్దుడు,నిజామాబాద్ ఐసోలేషన్ వార్డులో మృతి చెందిన వృద్దుడు.. ఈ ఇద్దరూ ఢిల్లీకి మర్కజ్కి వెళ్లి వచ్చినవారిగా గుర్తించారు. కుత్బుల్లాపూర్లో బయటపడ్డ పాజిటివ్ కేసులోనూ.. అతను మర్కజ్ ప్రార్థనలకు హాజరైనట్టు గుర్తించారు. సోమవారం(మార్చి 30) వరకు పరిస్థితి కాస్త అదుపులోనే ఉందనుకుంటున్న తరుణంలో.. మర్కజ్ గురించి బయటపడటం తెలంగాణలో కలకలం రేపుతోంది. సాధ్యమైనంత త్వరగా అక్కడికి వెళ్లి వచ్చినవారందరినీ క్వారెంటైన్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 77 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.