పోరాటాల గడ్డ..! ఇప్పుడు కవిత కోసం త్యాగాల గడ్డగా మారబోతోంది..!!
హైదరాబాద్: పోరాటాల పురిటి గడ్డ తెలంగాణ ఇప్పుడు త్యాగాల గడ్డగా మారిపోబోతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ ఎంపీ గా కల్వకుంట్ల కవిత ఓటమి చెందడంతో గులాబీ పార్టీలోని కొంత మంది ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యమంత్రి తనయ, కవితకు ఎలాగైనా అదికారం కట్టబెట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకోసం ఎన్నో కార్యక్రమాలకు పూనుకుంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలైతే పదవీ త్యాగానికి కూడా వెనకాడడం లేదు. చట్ట సభల్లో కవితను మళ్లీ చూడాలని, అందుకోసం దేనికైనా సిద్దమని కొంతమంది ఎమ్మెల్యేలు తెగేసి చెప్పుకొస్తున్నారు.
టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కవిత ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల నుంచి కవితను పోటీ చేయాలని ఆయన కోరారు. జగిత్యాల నుంచి కవితను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని తెలిపారు.
ఎమ్మెల్యేగా కవిత పోటీ చేయాలనుకుంటే జగిత్యాల నుంచే పోటీ చేయాలని చెప్పారు. కవిత పోటీ చేసే విషయంలో హైకమాండ్ దే తుది నిర్ణయమని అన్నారు. హుజూర్ నగర్ నుంచి కవిత పోటీ చేయబోరని స్పష్టం చేశారు.