బంగారు తెలంగాణ తెస్తానని.. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాడు.. కేసీఆర్పై ఉత్తమ్ ఫైర్
దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర లోని 288, హర్యానాలోని 90 అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు.. తెలంగాణ లో ఖాళీ అయిన హుజూర్ నగర్ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఇక మళ్ళీ ఎన్నికల హోరు మొదలు కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు.
అక్కడ ఆన్ లైన్ సినిమా టిక్కెట్లు రద్దు : స్వయంగా వెల్లడించిన మంత్రి..!!
ఉత్తమ్ మండిపాటు
హుజూర్ నగర్ ఉప ఎన్నిక కోసం జరిగే ఎన్నికలో సైదిరెడ్డిని బరిలో నిలుపడంపై ఉత్తమ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎలా టికెట్ ఇస్తారని నిలదీశారు. కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి భ్రష్టుపట్టించారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. హుజూర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతో..
2018 ఎన్నికల్లో సూర్యాపేటలోని హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యే గా ఉత్తమ్ గెలవగా.. లోకసభ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీ గా గెలిచారు. దీంతో తన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయడంతో అది ఖాళీ అయింది. ఇక ఈ స్థానం నుంచి నిజామాబాద్ మాజీ ఎంపీ కవితను టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెడతారని అప్పట్లో వార్తలు రావడంతో.. అందరూ దానిపై కన్నేశారు.
టీఆర్ఎస్ అభ్యర్థి గా సైదిరెడ్డి...
సైదిరెడ్డి 2018 ఎన్నికల్లో కేవలం 7వేల ఓట్ల తేడాతో ఒడిపోవడంతో.. మళ్ళీ ఆయనకే ఆ స్థానాన్ని ఇచ్చారు. అయితే కాంగ్రెస్ తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి పేరును ఇంతకుముందే ప్రకటించేశారు. మరి ఈ ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.
ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల..
ఈ మేరకు వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ను 23న విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. సెప్టెంబర్ 30 వరకు నామినేషన్స్ దాఖలు చేసుకోవచ్చని.. అక్టోబర్ ఒకటిన స్క్రూటిని జరుగుతుందని.. 3 న నామినేషన్లు విత్ డ్రా చేసుకోవచ్చని ప్రకటించారు. అక్టోబర్ 21న పోలింగ్.. 24న ఫలితాలు విడుదల కానున్నాయి.