'ఇక్కడి నుంచి ఉత్తరాలు, ఢిల్లీ నుంచి ఆధికారులు, అందుకే రేవంత్ ఇంటిపై ఐటీ దాడులు'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలపై కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ఇది రాజకీయ కక్ష అని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇలాంటి వాటికి భయపడేది లేదని తేల్చి చెప్పారు. జగ్గారెడ్డి నుంచి మొదలైందని, ఇప్పుడు రేవంత్ వద్దకు వచ్చారని, ఎన్నికల సమయంలో తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు స్పందించారు.
Recommended Video
రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటీ దాడులను ఖండిస్తున్నామని కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజకీయ కక్ష సాధింపుతోనే ఈ దాడులు అన్నారు. కాంగ్రెస్ నాయకులను అణగదొక్కే కుట్ర జరుగుతోందన్నారు. ఇవన్నీ తెరాస చేతకానితనానికి నిదర్శనం అన్నారు. ఓటమి భయంతో కేసీఆర్ పిచ్చి పనులు చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ను భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశ్యం
మొన్న జగ్గారెడ్డి, నేడు రేవంత్ రెడ్డి.. వరుసగా దాడులు నిర్వహిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైకోర్టు కొట్టేసిన కేసులను బయటకు తీసి కాంగ్రెస్ నాయకులను అణగదొక్కే ప్రయత్నాలు, కుట్ర చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పాత కేసులను తీయడం ఏమిటన్నారు. కేసీఆర్ను ఓటమి భయం వెంటాడుతోందని, అందుకే ఈ దాడులు అన్నారు.
నన్ను అరెస్ట్ చేస్తారు.. రేవంత్ రెడ్డి చెప్పిన కొద్ది రోజుల్లోనే ఐటీ దాడులు
ఎన్నికలకు ముందు అలవాటుగా మారింది
రేవంత్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులను వేం నరేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇలా ఐటీ దాడులు చేయడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్, బీజేపీలను కలిసి ప్రజలు ఓడిస్తారని ఇలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇంట్లో కేవలం పనివాళ్లే ఉన్నారని, ఎవరూ లేని సమయంలో దాడులు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న కుటుంబంతో సహా తిరుపతికి వెళ్లి వచ్చిన రేవంత్, ఈ రోజు ప్రచారంలో ఉన్నారని చెప్పారు. ప్రచారం ప్రారంభంలోనే రాజకీయ కక్షకు దిగారన్నారు. నూటికి నూరు శాతం ఇది రాజకీయ కక్షే అన్నారు.
ఉత్తరాలు ఇక్కడి నుంచి అధికారులు ఢిల్లీ నుంచి
కర్ణాటకలోను ఇలాగే జరిగిందని వేం నరేందర్ రెడ్డి గుర్తు చేశారు. అప్పుడు డీకే ఆదికేశవులు ఇంట్లో సోదాలు జరిగాయని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నేతల ఇళ్లపై సోదాలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసినంత మాత్రాన తాము భయపడే ప్రసక్తి లేదన్నారు. నెల రోజులుగా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఐటీ దాడుల విషయమై రేవంత్కు సమాచారం ఇచ్చామని, బెదిరేది లేదన్నారు. ఉత్తరాలు ఇక్కడి నుంచి వెళ్తే అక్కడి నుంచి (ఢిల్లీ) అధికారులు వచ్చారని, కేసీఆర్, మోడీ ఒక్కటేనని ఆరోపించారు. ప్రతిపక్షంలోనే బలమైన నాయకులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు.
భయపడేది లేదని సీతక్క
రాష్ట్రంలో ఐటీ దాడులు ఎవరి పైన అయినా నిర్వహించాలంటే మొదట కేసీఆర్ కుటుంబంపై చేయాలని మాజీ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సోదరుడు రేవంత్ కుటుంబంపై ఐటీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ కుటుంబం ఈ నాలుగున్నరేళ్లు అధికారంలో ఉండి వేల కోట్లు దోచుకుందని ధ్వజమెత్తారు. తాము భయపడే ప్రసక్తి లేదన్నారు.