పోలీసుల తీరుపై గవర్నర్ కి ఫిర్యాదు చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై ని కలిశారు . ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణా రాష్ట్ర పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గవర్నర్ తమిళిసై కి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ర్యాలీలకు అనుమతి ఇవ్వకుండా కావాలని హైదరాబాద్ పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, తన శాంతియాత్రకు సీపీ అనుమతి నిరాకరించడం పై గవర్నర్ కి ఫిర్యాదు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి .గాంధీ భవన్ దగ్గర ఆందోళన చేయనివ్వకుండా అడ్డుకున్నారన్న ఆయన టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులకు ఏం చేసినా ఎలా అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నించారు. కావాలనే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇబ్బంది పెడుతున్నారన్నారు..
సీపీ అంజనీ కుమార్ అవినీతిపై విచారణ జరిపించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. తమిళిసై సౌందర రాజన్ ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీపీ అంజనీకుమార్ ఫోన్ లో తనతో దురుసుగా మాట్లాడారని ఆరోపించారు . సెక్షన్ 8ను ఉపయోగించి చర్యలు తీసుకోవాలని కోరామని , పోలీసుల తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి తొత్తులా సీపీ తయారయ్యారని ఇటీవల పోలీసులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే .
ఇక ఆయనపై విమర్శలు చేసిన ఉత్తమ్ ఆంధ్రా కేడర్ ఆఫీసర్ అయిన అంజనీ కుమార్ తెలంగాణలో అక్రమంగా ఉంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఉన్నతమైన పదవి ఇచ్చిందని, దీంతో వారికి జీహుజూర్ అంటూ ఈ కమిషనర్ అణచివేత ధోరణిలో ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. అంతే కాదు కాంగ్రెస్ పార్టీ ఏమైనా నిషేధిత సంస్థనా? ఎందుకు పోలీసులు తమ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వటం లేదు అని ప్రశ్నించారు. అంజనీ కుమార్ ప్రవర్తనపై విచారణ జరపాలని గవర్నర్ని కోరామని అన్నారు.