కేంద్ర వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సంతకాల సేకరణ.!
మహబూబ్ నగర్/హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్ టీపిసిసి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మహబూబ్ నగర్ లో కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మనిక్కమ్ ఠాగూర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అంబానీ, అదానీల ఆస్తులను కాపాడటానికి పాకులాడుతుంటే, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా ఆయన కుమారుడు, కూతురు, అల్లుళ్ళ కోసం తాపత్రయ పడుతున్నారని ఠాగూర్ ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని చూడబోతున్నారని కాంగ్రెస్ శ్రేణులకు ఠాగూర్ భరోసా ఇచ్చారు. మిషన్ 2023 లక్ష్యంగా కార్యాచరణ రూపొందించి, కాంగ్రెస్ అధికారం చేపట్టబోతోందని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు మనిక్కమ్ ఠాగూర్.
బంగారు తెలంగాణ పేరుతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రజలను మోసం చేస్తున్నారని, ఆయన కుటుంబానికి మాత్రమే బంగారు రోజులు వచ్చాయని ఎద్దేవా చేసారు. మరో వైపు మోడీ సర్కార్ అంటే చంద్రశేఖర్ రావుకు భయమని, బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు మద్దతు తెలుపుతున్నారని విరుచుకు పడ్డారు. రైతు పక్షపాతి అని చెప్పుకుంటున్న చంద్రశేఖర్ రావు వెంటనే అసెంబ్లీ ఏర్పాటు చేసి వ్యవసాయ బిల్లును వ్యతిరేకించాలని ఠాగూర్ డిమాండ్ చేసారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన, యువత, బడుగు బలహీన వర్గాల నిలబడే పార్టీ అని స్పస్టం చేసారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, రైతుల నుంచి సంతకాల సేకరణ చేసి, రాష్ట్ర గవర్నర్ కు, రాష్ట్రపతి కి అందజేస్తామని మనిక్కమ్ ఠాగూర్ తెలిపారు.