శని వారం టీపీసీసీ గోదావరి జల దీక్ష.!నిరసన తెలుపుతారా.?నిర్బంధానికి గురౌతారా..?
హైదరాబాద్ : గోదావరి నది పైన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జల యజ్ఞం లో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను రేపు అంటే శనివారం సందర్శించి వాటి పురోగతితో పాటు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు జమానాలో ఆ ప్రాజెక్టుల పట్ల చూపుతున్న నిర్లక్షాన్ని ప్రజలకు తెలియ జేస్తామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.
ఈ విషయమై ఆయన శుక్రవారంనాడు డీసీసీ అధ్యక్షులతో, ముఖ్య నాయకులతో ఫోన్ లో మాట్లాడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ లు, నియోజక వర్గ ఇంఛార్జీలు, ఇటీవల ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, రాష్ట్ర స్థాయి నాయకులు వారి పరిధులలో ఉన్న ప్రాజెక్టుల వద్దకు వెళ్లి దీక్షలు చేయాలని తెలిపారు. ఈ సందర్బంగా ప్రాణహిత ప్రాజెక్టు స్థలం ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్యెల్సి జీవన్ రెడ్డి, ఎమ్యెల్యే జగ్గారెడ్డి పాల్గొంటారు.
Recommended Video
అలాగే ఎల్లంపల్లి వద్ద ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు కుసుమ కుమార్, ఏఐసీసీ కార్యదర్శి వంశీ చందర్ రెడ్డి, వరద కాలువ పరిధిలోని గౌరవల్లి జలాశయం వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, దేవాదుల ప్రాజెక్టు ఎమ్యెల్యే సీతక్క, దుమ్ముగూడెం ప్రాజెక్టు వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్యెల్యే పొడెం వీరయ్య, మాజీ ఎంపీ వి .హనుమంతరావు, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాములు నాయక్, అలిసాగర్ ప్రాజెక్టు వద్ద మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కామారెడ్డి సమీపంలో ప్రాణహిత 22వ ప్యాకేజీ భూంపల్లి వద్ద మాజీ మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ పాల్గొంటారని ఆయన వివరించారు. అలాగే నిర్మల్ వద్ద మాజీ ఎమ్యెల్యే మహేశ్వేర్ రెడ్డి, పాత కాళేశ్వరమ్ ప్రాజెక్టు వద్ద డీసీసీ అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి, పాల్గొంటారని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.