రాహుల్కు తలనొప్పి: విపక్ష పార్టీల నేతల చేరికపై తెలంగాణ కాంగ్రెస్ నేతల మోకాలడ్డు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆ పార్టీలోని సీనియర్ నేతలే అడ్డంకిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పోలిస్తే భిన్నమైన పరిస్థితి. 2014కు ముందు సీమాంధ్ర నేతల ఆధిపత్యం కింద మగ్గిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీపీసీసీ నేతలపై పార్టీకి సారథ్యం వహించాల్సిన బాధ్యతలు ఉన్నాయి. నేతలు 'అందరి వారు' అన్న అభిప్రాయం వస్తేనే ఎన్నికల సంగ్రామంలో ప్రత్యర్థులతో పోటీ పడగలరు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరేవారిని చేర్చుకోవాలని, అడ్డుకోవద్దని చెప్పినా తెలంగాణ కాంగ్రెస్ నేతలు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
కానీ 2014కు ముందు పరిస్థితుల్లోనే ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు ఉన్నారా? అని పరిణామాలు చెబుతున్నాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వస్తున్న నేతలను అక్కున చేర్చుకోవడం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి అవసరం. కానీ 'ఫలానా వాళ్లు చేరితే మాకు నష్టం' అన్న కోణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకల్లో ఆధిపత్య ధోరణే పెత్తనం చలాయిస్తోందా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ వేరే పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరాలని అనుకుంటున్న సీనియర్ నాయకులకు లైన్క్లియర్ కాకపోవడానికి ఇదే కారణమా..? వీటికి అవుననే సమాధానం వినిపిస్తోంది.
నామా టు మండవ వరకు సీనియర్ నేతల చేరికకు ఇలా రంగం సిద్ధం
ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తే తమకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో.. తమ ప్రాభవం ఎక్కడ తగ్గిపోతుందోనన్న నేతల వైఖరి అసలుకే ఎసరు పెట్టేలా ఉందని టీపీసీసీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. ఖమ్మంలో నామా నాగేశ్వరరావు, పాలమూరులో నాగం జనార్దన రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, ఇందూరులో మండవ వెంకటేశ్వరరావు, అన్నపూర్ణమ్మ, సిద్దిపేటలో ఒంటేరు ప్రతాపరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇనుగాల పెద్దిరెడ్డి, యాదాద్రిలో జిట్టా బాలక్రుష్ణారెడ్డి వంటి నేతలు చాలాకాలంగా కాంగ్రెస్లో చేరేందుకు యత్నిస్తున్నా, వారి చేరికలకు స్థానిక నేతలే మోకాలడ్డుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
పొట్ల నాగేశ్వరరావు చేరికపై ఎమ్మెల్సీ పొంగులేటి అసంతృప్తి
ఖమ్మం జిల్లాలోని టీడీపీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు మాజీ లోక్సభ సభ్యుడు. మారిన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్లో చేరతానంటూ ఆయన కబురు పంపారు. పార్టీ అగ్ర నాయకత్వం కూడా అందుకు సుముఖంగానే ఉంది. కానీ కాంగ్రెస్కే చెందిన రేణుకా చౌదరి నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. లోక్సభకు తాను అభ్యర్థిగా ఉండగా.. పోటీగా మరో అభ్యర్థిని ఖమ్మం లోక్సభ పరిధిలో తేవడానికి ఆమె అడ్డు చెబుతున్నారు. అదే జిల్లాకు చెందిన పోట్ల నాగేశ్వర్రావును జిల్లా నేతలకు తెలియకుండానే చేర్చుకున్నారని, దీనివల్ల స్థానికంగా ఇబ్బందులు వస్తున్నాయని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.టీడీపీ నాయకుడు నామా నాగేశ్వర్రావు చేరితే జిల్లాలో చాలాకాలంగా ఉన్న సీనియర్ల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డికి మద్దతుగా ఏఐసీసీ స్థాయిలో రాజకీయం
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న నేత. టీడీపీని వీడి బీజేపీలో చేరినా అక్కడ పెద్దగా ఉపయోగం లేదని భావించి కాంగ్రెస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉండాలని తన అనుచరులకూ నచ్చజెప్పారు. పార్టీ నాయకత్వం కూడా సూత్రప్రాయం గా ఆమోదం తెలిపింది. కానీ ఆయన్ను చేర్చుకుంటే పార్టీ వీడతానని మాజీ మంత్రి డీకే ఆరుణ హెచ్చరించారు. దీనిపై నాగర్కర్నూలు నుంచి ఐదారు సార్లు పోటీచేసి ఓడిపోయిన ప్రస్తుత ఎమ్మెల్సీ కె.దామోదర్రెడ్డి సైతం ఆందోళనగా ఉన్నారు. దామోదర్రెడ్డికి ఎమ్మెల్సీగా మరో నాలుగేళ్ల పదవీకాలం ఉందని, నాగం చేరికను వ్యతిరేకించాల్సిన అవసరంలేదని టీపీసీసీ వాదిస్తోంది. దామోదర్రెడ్డికి మద్దతుగా మాజీ మంత్రి డీకే అరుణ, ఎంపీ నంది ఎల్లయ్య, మరో ఐదారు నియోజకవర్గాల ముఖ్యనేతలు నాగం జనార్దన్రెడ్డిని చేర్చుకోవద్దని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీని కలిసి విజ్ఞప్తి చేశారు.
షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి అనుమతినిస్తేనే ఇందూరు నేతల చేరిక
నిజామాబాద్లో టీడీపీ సీనియర్ నేతలు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా సరేనంది. కానీ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి మహేష్కుమార్ నుంచి వారిని చేర్చుకోవద్దని ఒత్తిళ్లు వచ్చాయి. వీరి చేరికకు శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ సురేశ్రెడ్డి, మాజీమంత్రి సుదర్శన్రెడ్డి వంటి వారు అంగీకరించాలి. స్పష్టత రాకపోవడంతో మండవ వెంకటేశ్వరరావు, అన్నపూర్ణమ్మ టీఆర్ఎస్ వైపు ఆసక్తిగా చూస్తున్నారని ఇటీవలే వార్తలొచ్చాయి.
జానా, ఉత్తమ్ గ్రీన్ సిగ్నల్ కోసం బాలు నాయక్ ఎదురు చూపులు
నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బాలు నాయక్ కూడా టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారు. దేవరకొండ టికెట్ను ప్రస్తుత ఎమ్మెల్యే రవీంద్రనాయక్కు ఇచ్చే అవకాశాలు ఉండటంతో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్కు రాజకీయ గురువైన సీఎల్పీ నేత కె జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి నుంచి ఇంకా గ్రీన్సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి దేవరకొండ ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలూనాయక్.. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత మారిన పరిస్థితుల్లో ‘గులాబీ' కారెక్కి జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికయ్యారు. కానీ సీపీఐ నుంచి 2014 ఎన్నికల్లో గెలుపొందిన రవీంద్రనాయక్ టీఆర్ఎస్ గూటికి చేరడంతో ఆయనకే టిక్కెట్ ఖాయమయ్యే అవకాశాలు ఉన్నాయి.
అటు యెన్నం.. ఇటు జిట్టాలకూ ఇదే పరిస్థితి
పాత కరీంనగర్ జిల్లాకు చెందిన టీడీపీ నేత పెద్దిరెడ్డికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఆ జిల్లా మాజీమంత్రులు శ్రీధర్బాబు, జీవన్రెడ్డి వంటివారు ఆమోదం తెలియజేయాల్సి ఉంది. సిద్దిపేటలో ఒంటేరు ప్రతాపరెడ్డి, మహబూబ్నగర్లో యెన్నం శ్రీనివాసరెడ్డి, యాదాద్రి భువనగిరిలో జిట్టా బాలకృష్ణారెడ్డి.. ఇలా వీరే కాదు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైన ఓ మోస్తరు నాయకులకు ఇవే బెదిరింపులు అందుతున్నాయి. హెచ్చరికలు వస్తున్నా, వచ్చే ఎన్నికలలో బలమైన టీంతో తలపడకపోతే మళ్లీ కష్టాలు తప్పవన్న ఆవేదన కేడర్లో వినిపిస్తోంది. పార్టీలో చేరికలకు ఎదురు అవుతున్న అడ్డంకులు ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి కూడా చిరాకు తెప్పిస్తున్నట్టు సమాచారం.
ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇలా రాహుల్ గాంధీ సూచనలు
జిల్లాల్లో, స్థానిక పార్టీ నేతల నుంచి అభ్యం తరాలు వ్యక్తం కావడం కొత్తేమీ కాదని, ఈ పేరుతో చేరికలను ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దని ఏఐసీసీ అధినేత రాహుల్గాంధీ స్పష్టంగా ఆదేశించినట్టుగా పీసీసీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ కొందరు వ్యక్తులకు పరిమితం కాదని, అన్ని వర్గాలను మమేకం చేసుకుంటూ సమిష్టిగా పోరాటానికి సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి స్పష్టంగా సూచించినట్టుగా తెలుస్తోంది. కొత్తగా చేరే వారికి టికెట్ల గ్యారంటీ ఇవ్వొద్దని, అంతమాత్రాన పార్టీలో ఇప్పుడు ఆశిస్తున్నవారికే టికెట్లు వస్తాయన్న సంకేతాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని రాహుల్ చెప్పినట్టు సమాచారం. ఎన్నికలకు ముందు క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల నుంచి సమాచారం తీసుకుని, సర్వే చేయించి, గెలిచే వారికే టికెట్లు ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. భారీ అవినీతి కేసులు, రేప్ కేసులు, హత్య కేసులు వంటి పెద్ద నేరాభియోగాలు ఉన్నవారిని మినహా పార్టీలో చేరికలను ఆపొద్దని పార్టీ అధినేత ఆదేశించినట్లు టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఆచరణలో మాత్రం ఈ ఆదేశాలు అమలు అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు.