ఉత్తమ్పై వ్యాఖ్యలకు పీసీసీ షోకాజ్ నోటీసులు: తగ్గేదే లేదన్న కోమటిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం పలు అనుచిత వ్యాఖ్యాలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో టీపీసీసీ నోటీసులు జారీ చేసింది. వారంలో రోజుల్లో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ క్రమశిక్షణాసంఘం ఆదేశించింది. తెలంగాణలో వరుస పరాజయాలకు పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కారణమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం బహిరంగంగా విమర్శించారు.
గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రానా..! పార్టీ బలోపేతం కాదని చెప్పిన ఆయన, భువనగిరి ఎంపీగా సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమికా కారణం పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ గ్రూప్ రాజకీయాలేనని ఆరోపించారు.
ప్రస్తుత పీసీసీ ఛీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుపటి పీసీసీ ఛీఫ్ పొన్నాల లక్ష్మయ్యను మించిన అసమర్థుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పార్టీ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహించి ఉత్తమ్ కుమార్ తక్షణం రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా పార్టీకి తక్షణ సర్జరీ చేయాలని, లేకుంటే పోస్ట్ మార్టమ్ చేయడానికి పూనుకోవాల్సి వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని హెచ్చరించారు. కాగా, ఇటీవల మంత్రి హరీశ్ రావుని కలిసిన కోమటిరెడ్డి.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు. తమ భేటీలో రాజకీయ ప్రాధాన్యమేమీ లేదని తెలిపారు.
షోకాజ్ నోటీసులు లెక్కచేయను: వెంకటరెడ్డి
టీపీసీసీ పంపిన షోకాజ్ నోటీసులను తాను లెక్కచేయనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పీసీసీకి షోకాజ్ నోటీసులు ఇచ్చే అధికారం లేదన్నారు. ఉత్తమ్కి పీసీసీ ఇచ్చినందుకు పార్టీ నామరూపం లేకుండా పోతుందని విమర్శించారు.
ఈ విషయాన్ని 16 మాసాల కిందటే తాను చెప్పానని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్కుమార్రెడ్డి ఎవ్వరికీ సరైన గౌరవం ఇవ్వరని, నల్గొండ జిల్లాలో జానారెడ్డి, పాల్వాయి, ఉత్తమ్ కంటే తానే సీనియర్ నేతనని తెలిపారు. తాను టిఆర్ఎస్ పార్టీలో చేరుతానని ఎప్పుడూ చెప్పలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా వెంకటరెడ్డి పేర్కొన్నారు.