నోరు జారితే కొరడా ఝుళిపిస్తాం..! కాంగ్రెస్ నేతలపై టీపిసిసి గరంగరం..!!
హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కఠినంగా మారినట్టు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను సమిష్టిగా సమిక్షించుకోవాలి తప్ప వ్యక్తిగతంగా పరస్పర ఆరోపణలు చేసుకోకూడదని ఆదేశాలు జారీ చేస్తున్నారు ముఖ్యనేతలు. ఒక వేళ పార్టీ ఓటమికి ఒకరినో, ఇద్దరినో కారణంగా చూపిస్తూ బహిరంగ విమర్శలు చేస్తే సహించేది లేదని ఆ పార్టీ ముఖ్య నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
టీపిసిసి మరింత కఠినం..! నోరు జారితే వేటే అంటున్న ముఖ్యనేతలు..!!
నోరుజారే నాయకులపై టీపీసీసీ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుందా? కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు ద్వారా బలమైన సంకేతాలను ఇచ్చిందా? అంటే అవుననే అంటున్నాయి టీపీసీసీ వర్గాలు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఖుంటియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్లపై దూషణలకు దిగడంతో టీపీసీసీ సర్వేపై వేటు వేసింది. ఇది కాంగ్రెస్లో ధిక్కార స్వరం వినిపించే నాయకులకు బలమైన సంకేతాలను పంపించేందుకే అని పార్టీ వర్గాలంటున్నాయి.
పార్టీ క్రమశిక్షణకు కట్టుబడాల్సిందే..! వ్యక్తిగత విమర్శలు చేస్తే చర్యలు తప్పవు..!!
తెలంగాణ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను విశ్లేషించుకుంటూ వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలి గాని వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ముఖ్యనేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పార్టీ క్రమశిక్షణను అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్తున్నారు నాయకులు. ఇందులో భాగంగానే పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ పైన కూడా చర్యలు తీసుకున్నామని టీపిసిసి చెప్పుకొస్తోంది. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ లైన్ కి కట్టుబడి పనిచేయాల్సి ఉంటుంది తప్ప దిక్కార స్వరం వినిపిస్తే కఠిన చర్చలు తప్పవని అంటున్నారు.
కలిసికట్టుగా ముందుకు వెళ్తే మంచి ఫలితాలు..! విభేదాలు వద్దంటున్న నేతలు..!!
సాధారణ ఎన్నికలకు, పంచాయతీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు వ్యత్యాసం ఉండడంతో పాటు ప్రజల ఆలోచనా విధానంలో కూడా మార్పు ఉంటుందని, ఆ మార్పుకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని టీపిసీసీ నేతలు చెప్తున్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రభావం పడకుండా జాగ్రత్త వహిస్తే అనుకున్న ఫలితాలు వస్థాయని టీపిసిసి పార్టీ కార్యవర్గానికి మనో స్తైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.
తిరుగాబాలు ధోరణి వద్దు..! ఐకమత్యంతో ముందుకు వెళ్దామని టీపిసిసి సూచన..!!
గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, గజ్జెల కాంతం, క్యామ మల్లేశ్ తదితరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాలపై విమర్శలు చేసినా షోకాజ్ నోటీసులతో సరిపెట్టారు. లోక్సభ ఎన్నికల ముందు మాత్రం. టీపీసీసీలో ఉపేక్షించే వైఖరి కనిపించట్లేదని పార్టీ వర్గాలంటున్నాయి. ఏదైనా అసంతృప్తి ఉంటే అంతర్గతంగా, ప్రజాస్వామికంగా చర్చించుకోవాలే తప్ప, పార్టీని పలుచన చేసే తీరులో వెళ్తే వేటు తప్పదని.. సర్వే సస్పెన్షనే అందుకు సంకేతమని చెబుతున్నాయి. టీపిసిసి కఠిన వైఖరి పట్ల పార్టీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.