కూల్చే సంస్కృతి నాది కాదు: కేసీఆర్ కూల్చివేత వ్యాఖ్యలకు భట్టి కౌంటర్
హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రపన్నాయంటూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క స్పందించారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలుతుందని తానెప్పుడూ చెప్పలేదన్నారు. 'కూల్చే సంస్కృతి నాది కాదు' అని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్ అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఏదో ముసలం జరుగుతోందన్నారు.
బంగారు తెలంగాణ కోసం రాజకీయ పునరేకీకరణ అంటూ ఇతర రాజకీయ పార్టీల నేతలను చేర్చుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంలో దోపిడీదారులంతో ఒకవైపు చేరుతున్నారని, వారందరికీ కేసీఆర్ నాయకత్వం వహిస్తున్నారని మండిపడ్డారు.
కాంట్రాక్టర్లకు ప్రజాధన్నాన్ని దోచి పెట్టేందుకే మిషన్ భగీరథ, ప్రాజెక్టుల రీడిజైనింగ్, వాటర్ గ్రిడ్లను చేపట్టారని విమర్శించారు. దీనిపై విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల రీ డిజైన్పై త్వరలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని ఆయన చెప్పారు.
ఇదిలా ఉంటే భూసేకరణపై ఉద్యమానికి ఓ కమిటీ కాంగ్రెస్ పార్టీ వేసింది. దామోదర రాజనర్సింహ నేతృత్వంలో 20 మందితో ఓ కమిటీ వేశారు. భూసేకరణ చట్టం ప్రకారమే ప్రాజెక్టుల నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా కమిటీ డిమాండ్ చేసింది.