నల్గొండలో ప్రమాదం: ట్రాక్టర్ కాలువలో పడి 12 మంది మృతి
నల్గొండ: నల్గొండ జిల్లా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం పీఏపల్లి మండలం ఒద్దిపట్ల పడమటితండా వద్ద వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి ఏఎంఆర్పీ కాల్వలో పడింది.
ఈ ఘటనలో 12 మంది వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో సుమారు 30 మంది వ్యవసాయ కూలీలు ఉన్నట్లు సమాచారం. వ్యవసాయ పనుల నిమిత్తం ఒద్దిపట్ల నుంచి కూలీలను తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంపై సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
#Visuals from Telangana: Nine dead, several injured after the tractor-trolley they were travelling in fell into a canal in Nalgonda. pic.twitter.com/9fCVcEp1Yi
— ANI (@ANI) April 6, 2018
మృతులు రమావత్ సోనా, రమావత్ జీజా, జవుకుల ద్వాలి, రమావత్ కేలీ, రమావత్ కంసాలి, బాణవత్ బేరీ, రమావత్ భారతి, రమావత్ సురితలుగా గుర్తించారు. ప్రమాద ఘటనపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.