కవితపై ఆరోపణలు .. టీబీజీకేఎస్ నాశనం ఆమెవల్లే .. కార్మిక నాయకుడు కెంగర్ల మల్లయ్య
కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత పై, తెలంగాణ సీఎం కేసీఆర్ పై కార్మిక సంఘ నాయకుడు కెంగర్ల మల్లయ్య తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యమస్ఫూర్తిని కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ ఉద్యమస్ఫూర్తిని ఇకపై ఎన్నటికీ పొందలేరని కెంగర్ల మల్లయ్య పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని తాను స్థాపించాను అని చెప్పిన మల్లయ్య టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న కవిత వల్ల చాలా నష్టం జరిగిందని పేర్కొన్నారు.
కవిత యూనియన్ ను పైరవీ కారులకు అప్పగించి, కార్మిక సంక్షేమం కోసం పని చేసే వారిని వేధింపులకు గురి చేశారని ఆయన ఆరోపించారు. కొత్తగూడెంలో మీడియా సమావేశంలో మల్లయ్య టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం) గౌరవాధ్యక్షురాలు కవిత వల్లే తాను మరో యూనియన్ అయిన భారతీయ మజ్దూర్ సంఘ్ కండువా కప్పుకోవాల్సి వచ్చిందని విమర్శలు గుప్పించారు . కవితను నమ్మి తాము ఎన్నో బాధలను అనుభవించామని ఆయన పేర్కొన్నారు.
చీమల పుట్టలో పాములు చేరినట్టు పైరవీ కారులను చేర్చి కార్మిక యూనియన్ ను నిర్వీర్యం చేసే పని కవిత చేసినట్లుగా మల్లయ్య ఆరోపించారు. ఇక కవిత ద్వారా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో చొరబడిన కొన్ని కార్మిక వ్యతిరేక శక్తులు యూనియన్ ను నాశనం చేశాయని మల్లయ్య మండిపడ్డారు.ఒకపక్క తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక యూనియన్ ల పైన సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితుల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వ్యవస్థాపక నాయకుడైన కెంగర్ల మల్లయ్య చేసిన వ్యాఖ్యలు కార్మిక సంఘాలను ఆలోచింపజేస్తున్నాయి.