టిఆర్ఎస్ టిక్కెట్ల కోసం రిటైర్డ్ ఐఎఎస్,ఐపీఎస్లు
హైదరాబాద్:2019 ఎన్నికల్లో టిఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు భారీగా పోటీ పడుతున్నారు.తటస్థులు ఎక్కువ మంది టిఆర్ఎస్ టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టిక్కెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది. మేధావులు, సినీ, వ్యాపార ప్రముఖులున్నారని టిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
2019 ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అయితే ఇప్పటి నుండే టిక్కెట్టు కోసం ఆశావాహులు టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఏ పార్టీకి సంబంధం లేని వారు కూడ టిఆర్ఎస్ టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రిటైర్డ్ ఐఎఎస్, ఐపీఎష్ ఉద్యోగులు కూడ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
టిఆర్ఎస్ టిక్కెట్టు కోసం తటస్థుల ఆసక్తి
2019 ఎన్నికల్లో టిఆర్ఎస్ టిక్కెట్ల కోసం తటస్థులు ఆసక్తిని చూపుతున్నారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్ సభ్యులను కాదని తమకు టిక్కెట్లను కేటాయించాలని పలువురు ఆశావాహులు టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ప్రాతినిథ్యం లేని స్థానాల్లో కూడ టిక్కెట్టు కోసం భారీ సంఖ్యలో పోటీ నెలకొందని టిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
గ్రేటర్ హైద్రాబాద్ స్ఘానాలకు పోటీ
గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని స్థానాలకు పోటీ ఎక్కువగా ఉందని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు సినీరంగ ప్రముఖులు, మేధావులు ఆసక్తి చూపుతున్నారు. విశ్రాంత ఐఏఎస్లు, ఐపీఎస్లు నగరంలోని మరో నాలుగింటిపై కన్నేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాల్లో కొందరు విశ్రాంత అధికారులతో పాటు మేధావులు తమకు అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. టిక్కెట్టు కోసం కెసిఆర్ను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
విపక్ష ఎమ్మెల్యేలున్న చోట కూడ పోటీ
రంగారెడ్డి జిల్లాలో విపక్ష ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో పోటీకి ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థ పదవిని నిర్వహిస్తున్న ఓ అధికారి ఆసక్తిని చూపుతున్నారు.. పూర్వ వరంగల్ జిల్లాలోని ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న స్థానంలో పోటీకి ఎన్ఆర్ఐ పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. పార్టీ అధిష్ఠానానికి సన్నిహితంగా ఉండే వైద్యరంగంలోని ప్రముఖుడు సైతం ఒక నియోజకవర్గంపై కన్నేశారు. కోదాడ, హుజుర్నగర్లలో బలమైన సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారి టికెట్ పొందాలనే భావనతో ఉన్నారు. పూర్వ వరంగల్ జిల్లాకు చెందిన గుర్తింపు గల ఒక ఉన్నతాధికారి రాజకీయాలపై ఆసక్తితో తెరాస మంత్రులను సంప్రదించి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
సిట్టింగులను మారుస్తారనే ఆశలు
ప్రస్తుతం సిట్టింగులను మారుస్తారనే ఆశతో ఉన్నవారు ఆయా నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకొని పనిచేస్తున్నారు.హైదరాబాద్ జిల్లాలోని ఒక స్థానం తమకు కేటాయించాలని పారిశ్రామికవేత్తలు అధిష్ఠానాన్ని కోరారు. రంగారెడ్డి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో తమకు అవకాశమివ్వాలని ఇద్దరు వ్యాపారవేత్తలు కోరినట్లు తెలిసింది. మహబూబాబాద్ జిల్లాలోని ఒక స్థానంలో పోటీకి పోలీసు శాఖలోని ఉన్నతాధికారి పేరు వినిపిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఎనిమిది స్థానాలు, పూర్వ జిల్లాలైన కరీంనగర్లోని రెండు, మహబూబ్నగర్, వరంగల్, నిజామాబాద్లలో మూడేసి, మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని రెండేసి, నల్గొండలోని అయిదు స్థానాల్లో తటస్థులు తెరాస టికెట్ల కోసం గట్టి పోటీదారులుగా మారనున్నారు.