
గుంటూరు జిల్లాలో రైలుప్రమాదం: నల్గొండకు చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు మృతి; ప్రమాదమా? ఆత్మహత్యా?
గుంటూరు జిల్లా నడికుడి రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న రైలు ప్రమాద ఘటనలో ఓ తల్లి ఇద్దరు పిల్లలతో సహా మృతి చెందడం విషాదంగా మారింది. మృతులు నల్గొండ జిల్లా వాసులు కావడంతో నల్గొండలో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఇద్దరు చిన్నారులతో పాటు తల్లి మరణించిన దుర్ఘటనపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

రైలు ఢీ కొట్టిన ఘటనలో తల్లి ఇద్దరు పిల్లలు మృతి
ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రైలు పట్టాలు దాటుతుండగా ఫలక్నామ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో ఇద్దరు పిల్లలతో సహా తల్లి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నార్కట్పల్లి మండలం ఔర వాణి గ్రామానికి చెందిన రమ్య, తన ఇద్దరు పిల్లలు అయిన ఏడు సంవత్సరాల రిషిక్ రెడ్డి, ఐదు సంవత్సరాల హన్సిక రెడ్డి లతోపాటు రైలు ప్రమాద ఘటనలో మృతి చెందింది.

నడికుడి రైల్వే స్టేషన్ పరిధిలో ఘటన
రమ్య తన భర్త గాదె జాన్ రెడ్డితో గత కొన్ని సంవత్సరాలుగా నల్గొండ పట్టణంలోని చైతన్యపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి ఇద్దరు పిల్లలు రిషిక్ రెడ్డి, హన్సిక రెడ్డి లతో జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు పిల్లలు నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్ లోని ప్రేరణ స్కూల్లో చదువుతున్నారు. అయితే ఊహించని విధంగా సోమవారం రాత్రి గుంటూరు జిల్లా నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని తల్లి తో పాటు ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతదేహాలు సత్తెనపల్లి ఆస్పత్రికి తరలింపు
ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైలు ప్రమాద సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. దీంతో రమ్య కుటుంబం కన్నీరు మున్నీరుగా రోదిస్తుంది.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పిల్లలతో పాటు తల్లి మృతిపై అనేక అనుమానాలు
అయితే రమ్య గుంటూరు నడికుడి రైల్వే స్టేషన్ వద్దకు ఎందుకు వెళ్ళింది? ప్రమాదవశాత్తు జరిగిన ఘటననా? లేక దీని వెనుక మరేదైనా కారణాలు ఉన్నాయా? రమ్య తన పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకుందా? అసలేం జరిగింది అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఇద్దరు చిన్నారులతో పాటు తల్లి మృతి చెందిన ఘటన స్థానికంగా ఉన్నవారిని ఆవేదనకు గురి చేస్తోంది.