రంగారెడ్డి జిల్లా : పొలంలో కూలిన శిక్షణ విమానం.. తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్ : ట్రైనింగ్ ఫ్లైట్ కుప్పకూలిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మొఖిల గ్రామంలో చోటు చేసుకుంది. శిక్షణ తీసుకుంటున్న భరత్ భూషణ్ అనే యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఉదయం గాల్లోకి ఎగిరిన ఈ విమానంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కిందకు దించే ప్రయత్నంలో భాగంగా చెట్టుకు తగిలి విమానం రెక్కలు విరిగిపోయాయి. ఇది ఢిల్లీకి చెందిన ట్రైనింగ్ సెంటర్ విమానంగా భావిస్తున్నారు.
అయితే పంట పొలాల్లో విమానం పడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అదే జనావాసాలపై పడితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఆస్థినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా భారీ స్థాయిలో ఉండేదని గ్రామస్థులు వ్యాఖ్యానించారు.
గతంలో రక్షణశాఖకు చెందిన విమానం ఒకటి సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్ పల్లిలో కుప్పకూలింది. ఒక ఇంటిపై పడటంతో పైభాగమంతా దెబ్బతింది. తర్వాత ఫతేనగర్ లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఆ రెండు ఘటనల్లోనూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.