పారదర్శకత, ఆదాయం కోసమే "ఈ వేలం"..! సన్నాహాలు చేస్తున్న హెఎండీఏ అదికారులు..!!
హైదరాబాద్ : కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దైన ఈ వేళానికి మళ్లీ ఊపిరి పోస్తున్నారు హెచ్ఎమ్డీఏ అదికారులు. దీంట్లో భాగంగా నగర పురపాలక శాఖకు అదనపు ఆదాయం చేకూరుతుందని అదికారులు అంచనా వేస్తున్నారు.హెచ్ఎండీఏ అధికారులు మరోసారి ఉప్పల్ భగాయత్ ప్లాట్ల విక్రయంపై కసరత్తు చేస్తున్నారు. తద్వారా వచ్చే ఆదాయాన్ని హెచ్ఎండీఏ అధ్వర్యంలోని వివిధ ప్రాజెక్టులకు ఉపయోగించనుంది. గతంలో ఈ-వేలం నిర్వహించే సమయంలో పలు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ-వేలాన్ని రద్దు చేస్తూ అప్పటి కమిషనర్ జనార్ధన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అథారిటీ అధికారులు ఈసారి ప్లాట్ల వేలం పకడ్బందిగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటు న్నారు. ప్రస్తుతానికి ప్లాట్లు వేలం వేసేందుకు సిద్ధం చేయాల్సిన పనుల్లో అధికారులు నిమగమయ్యారు. ఇవి పూరైన వెంటనే త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
ఉప్పల్ భగాయత్ లేవుట్ ప్లాట్ల ఈ వేలం..! కమిషనర్ ఆదేశాలతో అధికారుల ఏర్పాట్లు..!!
ఉప్పల్ భగాయత్ పరిధిలో 2005లో హెచ్ఎండీఏ ల్యాండ్ పూలింగ్ కింద 733 ఎకరాలను సేకరించింది. ఇందులో 142 ఎకరాలు మెట్రో రైలు, జలమండలికి కేటాయించింది. ఫేజ్-1 కింద 413 ఎకరాలు లేఅవుట్లో ప్లాట్లను అభివృద్ధి చేసి వాటిని భూములు అప్పగించిన రైతులకు నష్టపరిహారంగా అందజేసింది. ఇందులోనే ఫేజ్-2 కింద 71.08 ఎకరాల లేఅవుట్లో 67 ప్లాట్లను(1,31,579 చ.గ) అభివృద్ధి చేసింది. ఒక్కో ప్లాట్ విస్తీర్ణం కనీసంగా 400 గజాలు కాగా అత్యధికం 5 వేలకుపైనే ఉంటాయి. ఈ ప్రాంతంలో రియల్ బూమ్ ఉండడంతో ఈ లేఅవుట్ను రెసిడెన్షియల్ జోన్ నుంచి మల్టీపర్పస్ జోన్గా మార్చింది. కాగా ఇందులోని 67 ప్లాట్లతో పాటు ఇతర లేఅవుట్లలోని 28 ప్లాట్లను కలిపి మొత్తం 95 ప్లాట్లను ఈ వేలంలో విక్రయించేందుకు గతేడాది సెప్టెంబర్లో అథారిటీ నోటిఫికేషన్ జారీ చేసింది.
త్వరలో నోటిఫికేషన్ జారీ..! ఆదాయం పై పెరుగుతున్న అంచనాలు..!!
ఈ ప్లాట్లు కొనుగోలు చేసేందుకు సైతం చాలామంది ఆసక్తి చూపారు. మరోవైపు పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు ఈ-వేలం నిర్వహణ బాధ్యతను ఈ ప్రొక్యూర్మెంట్ లిమిటెడ్(ఈపీఎల్), ఐసీఐసీఐ బ్యాంక్కు అప్పగించారు. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ఈ-వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రిజర్వు ధరను ఖరారు చేశారు. కానీ ఈ వేలం నిర్వహించే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడం, బిడ్డర్ల ఆందోళనతో అధికారులు వెంటనే ఈ వేలాన్ని రద్దు చేశారు. ఈ ఘటనతో అథారిటీపై ప్రజల్లో ఉన్న నమ్మకం సన్నగిల్లింది. ఈ క్రమంలోనే మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. ఇదికాక ఈ సారి ఈ-వేలం నిర్వహణ బాధ్యతను ఐసీఐసీఐ బ్యాంక్కు అప్పగించే అవకాశాలు లేవని తెలుస్తోంది.
వెయ్యి కోట్లకు పైగా ఆదాయం..! పకడ్బందీగా అమలు చేయాలంటున్న అదికారులు..!!
ఉప్పల్ భగాయత్ లేఅవుట్లోని 67 ప్లాట్లు దాదాపు 400 చదరపు గజాల నుంచి 5,000 చదరపు గజాలపైనే ఉంటాయి. రెసిడెన్షియల్ జోన్ కింద ఉన్న లేఅవుట్ను మల్టీపర్పస్గా మార్చారు. కాగా ఈ ప్లాట్లు కార్యాలయాల ఏర్పాటుకు, వాణిజ్య కాంప్లెక్స్లకు, భారీ ఆపార్ట్మెంట్లకు, మల్టీప్లెక్స్లకు, షాపింగ్ మాల్స్ విద్యాసంస్థలకు, హాస్పిటల్స్ ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉన్నాయి. దీంతో ఈ లేఅవుట్లోని ప్లాట్లకు భారీ డిమాండ్ ఉంటుందని అధికారులు అంచనా. ఈ వేలం ద్వారా హెచ్ఎండీఏకు దాదాపు 1000-1500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇలా వచ్చిన ఆదాయాన్ని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోని చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు ఖర్చు చేయనున్నారు.
ఈ వేలంతో ఖర్చు తక్కువ..! ఆదాయం ఎక్కువ..!!
ఇక గత ఈ వేలంలో తక్కువ ధరతో ఎక్కువ ఆదాయాన్ని పొందే విధంగా అథారిటీ ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా అక్కడి మార్కెట్ ధర కంటే తక్కువగా.. ప్లాట్ రిజర్వు ధర 28వేల రూపాయలుగా నిర్ణయించారు. అయితే ఈ ప్రయోగం బెడిసి కొట్టిందనే చెప్పుకోవాలి. కాగా ఈ ప్లాట్లు అప్పట్లోనే చదరపు గజానికి 40-60 వేల రూపాయల వరకు ధర పలికినట్టు వినికిడి. ఈసారి ఈ-వేలం ప్రక్రియ విజయవంతమైతే, నగరానికి తూర్పు వైపున ఉండే ప్లాట్లు, భూముల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ రియల్ వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది. దీనికితోడు ప్లాట్ల ఈ-వేలం రియల్ వ్యాపారానికి మరింత ప్రోత్సాహం ఇవ్వనుందని తెలుస్తోంది.