పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు..!రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి ఆదేశాలు..!!
హైదరాబాద్: పుర పోరుకు ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి. అందుకు అదికార యంత్రాగాన్ని సంసిద్దం చేస్తోంది ఈసీ. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి ఆదేశించారు. త్వరలో జరగనున్న నగర, పురపాలక సంస్థల ఎన్నికలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై వారి సూచనలు, సలహాలను తీసుకోవాలన్నారు. పురపాలక ఎన్నికల సందర్భంగా నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం పురపాలక ఎన్నికల పరిశీలకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది.
ప్రతి వార్డూ ఒక నియోజకవర్గం..! నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామన్న ఈసి..!!
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్చందా, అదనపు డీజీపీ గోవింద్సింగ్, పురపాలక శాఖ డైరెక్టర్ టి.కె.శ్రీదేవి, ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్కుమార్ పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణపై పరిశీలకులు ముందస్తుగా తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలతోపాటు విధి విధానాలపై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో 129 పురపాలక సంఘాలు, మూడు నగరపాలక సంస్థల్లో 3,149 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. ప్రతి వార్డునూ ఒక నియోజకవర్గంగా పరిగణిస్తామని పేర్కొంటూ పరిశీలకులు వారికి కేటాయించిన వార్డుల్లో అందుబాటులో ఉండాలన్నారు.
వివరాల కోసం టి-పోల్ పోర్టల్..! అభ్యర్థుల వ్యయంపై గట్టి నిఘా..!!
శాసనసభ ఎన్నికల నిర్వహణలో అనుసరించిన విధి విధానాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవలంబించాలన్నారు. రాష్ట్ర పురపాలక ఎన్నికలకు సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా టి-పోల్ పోర్టల్ను రూపొందించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలవారీగా ఓటరు జాబితాలు రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఓటర్లు తమ వివరాలు తెలుసుకోవడమే కాకుండా ఓటరు స్లిప్పులను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లు ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు..! పొరపాట్లకు తావు ఇవ్వొదంటున్న ఎన్నికల అదికారి..!!
పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని.. ప్రధానంగా వెలుతురు ఉండేలా చూడాలని కమిషనర్ సూచించారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లతోపాటు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఎన్నికల ప్రచారంలో లౌడ్ స్పీకర్లకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే అనుమతి ఉంటుందన్నారు. అభ్యర్థుల వ్యయానికి సంబంధించి ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా షాడో రిజిస్టర్లను నిర్వహించాలన్నారు. సూక్ష్మ పరిశీలకులు సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్కు ఏర్పాట్లు చేస్తున్నట్లు నాగిరెడ్డి చెప్పారు.
కేంద్రాల ప్రకటన 21న..! లోతైన కసరత్తు చేస్తున్న ఈసీ..!!
ఎన్నికలు జరిగే పురపాలక సంఘాల్లో పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటన షెడ్యూల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ఈ నెల 18న కాకుండా 21న ప్రకటించనున్నారు. పోలింగ్ కేంద్రాల ముసాయిదాను ఈ నెల 17న ప్రచురించి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని అదే రోజు పరిష్కరించి 21న ప్రచురిస్తారు. పోలింగ్ కేంద్రాలపై రాజకీయ పార్టీలతో 17న సమావేశం నిర్వహిస్తారు.