బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం ... ఆ గిరిజన ఎమ్మెల్యే 36 గంటల నిరవధిక దీక్ష
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ 36 గంటల నిరవధిక దీక్షకు దిగారు. విభజన చట్టంలోని హామీ అయిన బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని ఆమె ఆరోపించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి నాటి ప్రభుత్వాలు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన బానోత్ హరిప్రియ ఉక్కు పరిశ్రమ సాధన కోసం దీక్ష చేస్తున్నట్లు గా తెలిపారు.
విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రకటించిందని కానీ ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమ అంశాన్ని పక్కన పెట్టాయని ఆమె విమర్శించారు. ఒక గిరిజన మహిళ గా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని, తన దీక్షతోనైనా కళ్ళు మూసుకుపోయిన ప్రభుత్వాలు ఇకనైనా కళ్లు తెరవాలని ఆమె పేర్కొన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసే వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉద్యమాన్ని వీడేది లేదని ఆమె వెల్లడించారు.
హరిప్రియ దీక్షకు మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మద్దతు ప్రకటించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి, మహబూబాబాద్ డిసిసి అధ్యక్షుడు భరత్ చంద్ర రెడ్డి, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ సారథి, గోపగాని శంకర్రావు, ఉక్కుసాధన కమిటీ కన్వీనర్ అయిలయ్య తదితరులు గిరిజన మహిళా ఎమ్మెల్యే బానోతు హరిప్రియ దీక్షకు మద్దతు ప్రకటించారు.
సీఎం కేసీఆర్ , ప్రధాని మోడీలు ఐదేళ్లుగా సర్వేల పేరుతో కాలయాపన చేశారని ఫైర్ అయిన ఆమె టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు . మళ్లీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఉక్కు పరిశ్రమ కల సాకారమవుతుందని ఎమ్మెల్యే హరిప్రియ చెప్పుకొచ్చారు. హరిప్రియ దీక్షను భగ్నం చేయడానికి తుడుందెబ్బ నాయకులు ప్రయత్నించగా వారిలో 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బయ్యారం ఉక్కు తెలంగాణా హక్కు అంటూ ఉక్కు పరిశ్రమ సాధించేవరకు పోరాటాలకు వెనకాడబోమని హరిప్రియ స్పష్టం చేశారు.