మేడారం జాతర విశిష్టత, ఎవరీ సమ్మక్క-సారలమ్మ?: ‘కుట్రతోనే జయించారు.. వీరోచితంగా కాదు’
హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇప్పటికే ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే కావడం గమనార్హం. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు కోటి నుంచి 3 కోట్ల మంది వరకు భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. ఫిబ్రవరి 5-8 వరకు ఈ ఏడాది మేడారం మహా జాతర కొనసాగుతుంది.
Recommended Video
వనదేవతల గిరిజన జాతర..
ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, కేవలం తెలంగాణలోనే గాక భారత దేశంలోనే వనదేవతులుగా పూజలందుకుంటున్నారీ వనదేవతలు సమ్మక్క-సారక్క. మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిశా, చత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది.
ఎవరీ సమ్మక్క, సారలమ్మ?
13వ శతాబ్దంలో నేటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి వివాహం జరిగింది. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు.
మేడారంపై దండెత్తిన కాకతీయ సేనలు..
రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు, మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు ‘పగిడిద్దరాజు' కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు.
యుద్ధ భూమిలో వీరమరణం.. జంపన్న ఆత్మహత్యతో..
సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు,సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కానీ, సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధికెక్కింది.
సమ్మక్క వీరోచిత పోరాటం.. దొంగచాటుగా బల్లెంతో..
తన కొడుకు, కుమార్తె మరణించారన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. వందలమందిని మట్టుపెడుతుంది.. వీరోచితంగా పోరాటం సాగిస్తుంది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్య చకితుడవుతాడు. ఇక ఓటమి తప్పదని భావించిన ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెనుక నుంచి పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి గుట్ట మలుపు తిరిగిన తర్వాత ఆమె అదృశ్యమవుతుంది. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు.
కుట్రతోనే జయించారు.. వీరోచితంగా కాదు
కాగా, సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించదు, కానీ ఆ ప్రాంతములో ఒక చెట్టు కింద పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభిస్తుంది. అంతేగాక, శత్రు సేనలు రాజ్యాన్ని కుట్రతోనే జయించారని.. వీరోచితంగా కాదని.. రెండేళ్లకోసారి భక్తిశ్రద్ధలతో తనను పూజిస్తే భక్తుల కోరికలు తీరుస్తాననే సమ్మక్క మాటలు ఆకాశవాణిగా వినిపిస్తాయి. ఆ తర్వాత సమ్మక్క భక్తులుగా మారిన కాకతీయ రాజులు ఈ ప్రాంతంలోని గిరిజనులపై పన్నులు ఎత్తివేసి.. సమ్మక్క-సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు చేస్తారు. ఈ నేపథ్యంలో తమకు లభించిన పసుపు, కుంకమ భరిణెలనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క-సారలమ్మ జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరుగుతోంది.
జాతరలో కీలక ఘట్టాలు..
జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో పలువురు భక్తులు పూనకంతో ఊగి పోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యద్ద స్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం(బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజన వాళ్ళే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు.
తెలంగాణా కుంభమేళా.. గిరిజన జాతర.. మహా జాతరగా..
మేడారం జాతరను తెలంగాణ కుంభమేళగా కూడా పేర్కొంటారు. సమ్మక్క-సారలమ్మ జాతర రెండు ఏళ్లకు ఒక సారి జరుగుతుంది, సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు.. కానీ 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటేట జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటుచేయబడి ఉంటాయి. ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణెలను తీసుకు వస్తారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణా నుండే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, జార్ఖండ్, తదితర రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.
అధికారికంగా వేడుకలు..
కోయ గిరిజనుల ఉనికికోసం పోరు సల్పిన సమ్మక్క-సారలమ్మ జాతర కీ. శ.1260 నుంచి 1320 వరకు ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలం నుంచి కొనసాగు తున్నట్లు స్థల పురాణాలు తెలుపు తున్నాయి. మేడారం జాతర గద్దెల ప్రాంగణానికి సాంప్రదాయ పద్ధతిలో దేవతలను తీసుకు వస్తారు. వంశపారపర్యంగా వస్తున్న గిరిజనులే ఇక్కడ పూజారులుగా కొనసాగుతున్నారు.
మేడారం జాతరకు సుమారు పది రోజుల ముందు నుంచే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సారలమ్మ పూజారులు కన్నెపల్లిలోని గుడి వద్ద అమ్మ వారిని పూజించి సమ్మక్క దేవతాపూజారులైన సిద్దబోయిన వారింటికి వస్తారు. సమ్మక్క పూజారులు చిలుకలగుట్ట వద్దకు వెళ్ళి దేవతను కుంకుమ భరిణ రూపంలో తీసుకు వస్తారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు 10 రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపి దేవతను గద్దెకు తీసుకువస్తారు. భక్తుల మొక్కుబడుల అనంతరం తిరిగి దేవతలు వనప్రవేశం చేస్తారు.