ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్: కాళేశ్వరం ఎత్తిపోతల్లో మరో ప్రమాదం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనుల వద్ద వరుసగా నాలుగో రోజూ ప్రమాదాల పరంపర కొనసాగింది. శుక్రవారం ధర్మారం మండలం నందిమేడారం వద్ద ఆరో ప్యాకేజీలో జరిగిన ప్రమాదంలో అయిదుగురు గాయపడ్డారు.
కరీంనగర్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనుల వద్ద వరుసగా నాలుగో రోజూ ప్రమాదాల పరంపర కొనసాగింది. శుక్రవారం ధర్మారం మండలం నందిమేడారం వద్ద ఆరో ప్యాకేజీలో జరిగిన ప్రమాదంలో అయిదుగురు గాయపడ్డారు. మంగళవారం ఆరో ప్యాకేజీ వద్ద కూలీలు విశ్రాంతి తీసుకునే షెడ్లు ప్రమాదవశాత్తు దగ్ధమవగా.. రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లింది. బుధవారం పదో ప్యాకేజీలో ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ వద్ద సొరంగాల్లో బండరాళ్లు కూలి ఏడుగురు మృత్యువాత పడ్డారు.
గురువారం ఏడో ప్యాకేజీలో సొరంగంలో బెంచింగ్ పనులు చేస్తుండగా బండరాయి తలపై పడి అసోంకు చెందిన దేవాజిత్ సోనోవాల్ మృత్యువాత పడ్డాడు. తాజాగా శుక్రవారం మళ్లీ ఆరో ప్యాకేజీలో జరిగిన ప్రమాదంలో అయిదుగురు గాయపడ్డారు. వరుసగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు గుత్తేదార్లు, ఇంజనీరింగ్ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతుండటం వారిని కలవరపెడుతోంది.
అత్యంత గోప్యంగా క్షతగాత్రులకు చికిత్స
శుక్రవారం ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను కరీంనగర్ తరలించారనే సమాచారంతో జడ్పీ మాజీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు ప్రైవేటు ఆసుపత్రి వద్దకు వెళ్లారు. అక్కడా వారు లేరని చెప్పడంతో వెనుదిరిగారు. కరీంనగర్కు తరలించారని కొందరు, పెద్దపల్లికి తరలించామని కొందరు చెప్పగా.. మంచిర్యాల తరలించామని ఇంజనీరింగ్ కింది స్థాయి సిబ్బంది పేర్కొన్నారు.
అయితే తిప్పాపూర్ ప్రమాద మృతులను కరీంనగర్ తరలించగా కాంగ్రెస్ నాయకులు నిరసనలు చేపట్టారనే ఆలోచనతో గురువారం ఏడో ప్యాకేజీలో మృతి చెందిన కూలి మృతదేహాన్ని సైతం పెద్దపల్లికి తరలించారు. తాజాగా శుక్రవారం నాటి క్షతగాత్రులకు ఎక్కడ చికిత్సచేయిస్తున్నారనే విషయం అత్యంత గోప్యంగా ఉంచారు. కాగా వారిని కరీంనగర్ నుంచి మంచిర్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించినట్లు తెలిసింది.