హుజూర్ నగర్ పోరు ... సైదిరెడ్డి కోసం రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్ రావు
హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ విజయం సాధించాలంటే అష్టకష్టాలు పడుతుంది. ఇక టిఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ట్రబుల్ షూటర్ మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగుతున్నారని తెలుస్తోంది . టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా మంత్రి హరీష్ రావు ప్రచారం చేయనున్నారు. 17, 18 తేదీల్లో మంత్రి ప్రచారం చేసేందుకు ఇక రంగంలోకి దిగనున్నారు.
హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ కు దిమ్మ తిరగాలన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
ట్రబుల్ షూటర్ ముందు హుజూర్ నగర్ ఎన్నికల టాస్క్
గత ఎన్నికల ఫలితాల తర్వాత నుండి నిన్న మొన్నటి వరకూ సైలెంట్ గా ఉన్న మంత్రి హరీష్ రావు ఇన్నాళ్లకు తన నియోజకవర్గాన్ని దాటి పార్టీ కోసం పని చేయడానికి ముందుకు సాగనున్నారు. మంత్రి హరీశ్ రావు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తే ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందని, రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని ,పరిస్థితులన్నీ గులాబీ పార్టీకి అనుకూలంగా మారుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ అది అంత ఈజీ కాదని తాజా పరిణామాల నేపధ్యంలో అర్ధం అవుతుంది.
ప్రచారానికి దూరంగా కేటీఆర్ .. రీజన్ ఇదే
నిజానికి హుజూర్ నగర్ ఉప ఎన్నిక బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తీసుకున్నారు. ఈ మేరకు ఈనెల 4న ప్రచారంలో కూడా పాల్గొన్నారు. కేటీఆర్ అక్కడ రోడ్ షో నిర్వహించారు. ఈనెల 5వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభం కావడంతో మంత్రి కేటీఆర్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చడంతో జనంలోకి వస్తే కార్మికులు అడ్డుకుని నిలదీసే అవకాశం ఉంటుందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ఈనెల 10 ,11వ తేదీల్లో చేపట్టాల్సిన పర్యటనలను కూడా రద్దు చేసుకున్నారు కేటీఆర్.
ప్రతికూల పరిస్థితుల్లో రంగంలోకి హరీష్ రావు
ఈ క్రమంలోనే మొన్న పార్టీ నేతలతో కేవలం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరోవైపు 18న ముఖ్యమంత్రి కేసీఆర్ తో భారీ సభ నిర్వహించాలని నిర్ణయించారు. సమ్మె ప్రభావంతో సభకు సీఎం కేసీఆర్ వస్తారా రారా అనేది అనుమానమే. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం టిఆర్ఎస్ పార్టీపై గట్టిగానే పడుతోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఎదురీదాల్సి వస్తోంది. ఇక ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగుతుండడం ఒకింత ఇబ్బందికర పరిణామమే.
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో హరీష్ ప్రచారంపై సర్వత్రా ఆసక్తి
ఒకపక్క ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి హరీష్ రావు పర్యటన ఎలా ఉండబోతుంది అన్న ఉత్కంఠ హుజూర్ నగర్ లో నెలకొంది. గతంలో ఆర్టీసీ యూనియన్ కు హరీష్ రావు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆర్టీసీ కార్మికులతో ఆయన సత్సంబంధాలు నెరిపారు. ఈ సమయంలో ఆయన హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన సైదిరెడ్డికి మద్దతుగా ఓటెయ్యాలని ప్రచారం చేయనున్నారు.
హరీష్ ప్రచార తేదీల్లోనే ప్రచారానికి రంగంలోకి రేవంత్
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి 17 , 18 తేదీల్లో హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. మొత్తానికి చాలా కాలం తర్వాత ట్రబుల్ షూటర్ హరీష్ రావు హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోరులో ప్రచారం చేయనున్నారు. ఇక పరిణామాలు ఎలా మారుతాయి, ఫలితం ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి.