కాళేశ్వరంతో కష్టాలు తెచ్చారు..! తెలంగాణ గ్రామీణ ప్రజల్లో అసంతృప్తి..!!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు తుది ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 21న దేశంలోని అతిరథ మహానేతల చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. ప్రాజెక్టు ఎంత వేగవంతంగా నిర్మించారో, అన్ని అవరోధాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొందని తెలుస్తోంది. ఐతే తెలంగాణ ప్రజల సాగు, త్రాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం చూపిస్తోందని నేతలు విశ్వశిస్తున్నారు.
ఐతే ప్రాజెక్టు నిర్మాణంలో బాగంగా ఎంతొ మంది నిరాశ్రియులయ్యారని, కొంతమంది రైతులు సర్వస్వం కోల్పోవాల్సి వచ్చిందనే చర్చ కూడా జరుగుతోంది. పునరావాసం కల్పించినప్పటికి, పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించినప్పటికి భవిశ్యత్తు అంధకారంమైందని కొంతమంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు కాళేశ్వరం పరిసర గ్రామాల్లో ఏం జరుగుతోంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
కాళేశ్వరంతో రోడ్డున పడ్డాం..! స్థానికుల ఆవేదన..!!
ఔను... కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలోని కొన్ని చిన్నాచితకా ప్రాజెక్టులు ఖాళీ అవుతున్నాయట. పెద్ద చేప.. చిన్న చేపలను మింగినట్టుగా, కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చి, చిన్న చిన్న ప్రాజెక్టులను మింగేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనికి అట్టహాసంగా, ఆర్భాటంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టును కేవలం మూడేళ్లలోనే నిర్మించి చరిత్ర సృష్టించామంటూ చంద్రశేఖర్ రావు ప్రభుత్వం జబ్బలు చరుచుకుంటోంది. నిజమే... ఎవరూ కాదనలేరు. కచ్చితంగా, ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనతే. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాలకు నీరందుతుంది. భూములన్నీ సస్యశ్యామలమవుతాయి. వేలమంది రైతుల బతుకులు బాగుపడతాయి. ఇదంతా, నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు కూడ చూద్దాం.
తూతూ మంత్రంగా పునరావసం..! ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు..!!
ఈ ప్రాజెక్టుపై చూపుతున్న శ్రద్ధను, మిగతా సాగునీటి ప్రాజెక్టులపై చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఎందుకు చూపడం లేదు..? 'కాకులను కొట్టి గద్దలకు వేసినట్టుగా', చిన్నతరహా ప్రాజెక్టులను పూర్తిగా గాలికొదిలేసి, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తే సరిపోతుందా...? రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు నీళ్లు వద్దా..? ఆ భూములు కూడా సస్యశ్యామలం కావొద్దా...? అక్కడి రైతులు బతకొద్దా...?అనే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.
కాళేశ్వరం పేరుతో మిగతా ప్రాజెక్టులకు మూత..! పట్టించుకోని ప్రభుత్వం..!!
దక్షిణ తెలంగాణలో ఇలా అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ - నారాయణపేట జిల్లాలకు సాగు-తాగునీటిని అందించే మధ్యతరహా ప్రాజెక్ట్ కోయిల్ సాగర్ నిర్వహణపై చంద్రశేఖర్ రావు ప్రభుత్వం పూర్తిగా శీతకన్ను వేసింది. ఈ ప్రాజెక్ట్ నిర్వహణకు ఏటా నిధులు ఇవ్వాలి. కానీ, ఇప్పటివరకూ చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదట. కనీసంగా, ఆ ప్రాజెక్ట్ వద్ద లైట్లు కూడా వెలగడం లేదట. ఈ ప్రాజెక్టుపై పరాటకులు నడిచి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన నడక దారి గుంతలమయంగా మారిందట. ఈ ప్రాజెక్ట వద్ద కనీస మరమ్మతులు చేపట్టేందుకు కూడా నిధుల్లేవని చెప్పడం శోచనీయమని తెలుస్తోంది.
రైతుల్లో నెలకొన్న అనుమానాలు..!నివృత్తి చేయలేకపోతున్న అదికారులు..!!
కోయిల్ సాగర్ జలాశయం... మహబూబ్ నగర్ - నారాయణపేట జిల్లాలోని దేవరకద్ర, చిన్నచింతకుంట, ధన్వాడ, మరికల్ మండలాల్లోని దాదాపుగా 50వేల ఎకరాలకు సాగు నీటిని అందించగలదు. నారాయణపేట, కొడంగల్ మండలాల్లోని గ్రామాలు - మహబూబ్ నగర్ పట్టణానికి తాగునీటి అవసరాలు తీరుస్తోంది. జూన్ నెల చివరిలో జూరాల ప్రాజెక్ట నుంచి ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టులోకి నీటిని తరలించే అవకాశం ఉంటుంది. నీటి పారుదల శాఖ అధికారులు ఆలోపు ప్రాజెక్టు వద్ద నిర్వహణ పనులకు చర్యలు తీసుకోవాలి. జూన్ నెలలో రెండు వారాలు పూర్తయినా అధికారులు కనీసం స్పందించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.