సదానంద మాట: హైకోర్టు విభజనకు అడ్డుపడుతున్నది చంద్రబాబే
న్యూఢిల్లీ: హైకోర్టు విభజనకు అడ్డుపడుతున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనా? అవునని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ చెప్పినట్లు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి అంటున్నారు. రాష్ట్ర విభజనలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన గురువారం మీడియాతో అన్నారు.
అంశాలవారీగా తాము కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. హైకోర్టు, విద్యా సంస్థల విభజన విషయంలో తమకు న్యాయం జరగడం లేదని చెప్పారు. అధికారుల విభజనలో కూడా తెలంగాణకు తగిన న్యాయం జరగడం లేదని చెప్పారు. విభజన సమస్యలపై చర్చించేందుకు తమ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు 9 సార్లు ప్రధాని నరేంద్ర మోడీని కలిసినట్లు ఆయన తెలిపారు.
ఉమ్మడి హైకోర్టు విభజనలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తోందని తెలంగాణ న్యాయవాదుల జెఎసి కో-కన్వీనర్ టి.శ్రీరంగారావు ఆరోపించారు. ఇందుకు నిరసనగా జూన్ 6 నుంచి ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని చెప్పారు. హైకోర్టు విభజన అంశం న్యాయస్థానంలో ఉన్న నేపథ్యంలో అవసరమైతే ఆర్డినెన్స్ ద్వారా విభజించాలని డిమాండ్ చేశారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిన బిజెపి అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా కనీసం హైకోర్టును విభజించలేక పోతోందని ఆయన బుధవారం మీడియాతో అన్నారు.
న్యాయవ్యవస్థ నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండు చేశారు. 60:40 నిష్పత్తి పాటించాలని, దిగువ న్యాయస్థానాల్లో ఏ ప్రాంతం వారిని అక్కడే న్యాయమూర్తులుగా నియమించాలని కోరారు.