పార్టీ జెండాతో టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో ఏముందంటే..!
పార్టీ జెండా మోశాడు. పార్టీ విజయాల కోసం పనిచేశాడు. తీరా అదే పార్టీ జెండాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో జరిగింది. పార్టీ అభివృద్ధి కోరుకున్న వీరాభిమాని చనిపోవడం స్థానికంగా చర్చానీయాంశమైంది. నిజాంపేట రాజీవ్ గృహకల్పలో నివాసముండే 52 ఏళ్ల వయసున్న గురువప్ప స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సూసైడ్ చేసుకుని తనువు చాలించాడు.
చిరువ్యాపారిగా కుటుంబాన్ని పోషించుకునే గురువప్పకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. టీఆర్ఎస్ కు వీరాభిమానిగా మారిన గురువప్ప పార్టీ కోసం పనిచేసేవాడు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా వ్యవహరించిన గురువప్ప రాష్ట్ర సాధన కోసం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పార్టీ కోసం పనిచేస్తూ వచ్చాడు. ఎన్నికల కోసం పార్టీ తరపున గల్లీగల్లీలో ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ కార్యాలయంలో ఉరివేసుకుని చనిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
అమరవీరులకు వందనాలు.. సూసైడ్ నోట్
గురువప్ప తాను చనిపోతూ రాసిన సూసైడ్ నోట్ చర్చానీయాంశంగా మారింది. అమరవీరులకు వందనాలు.. ఎమ్మెల్యేగా వివేకానందను గెలిపించాలి.. ఆయన మంత్రి కావాలి.. కేసీఆర్ తిరిగి సీఎం కావాలి.. నా కుటుంబాన్ని ఆదుకోవాలి అని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.
తెలంగాణ కోసం కలలు కనడమే గాకుండా టీఆర్ఎస్ పార్టీ కోసం గురువప్ప ఎంతో శ్రమించాడని చెబుతున్నారు సన్నిహితులు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇక్కడి ప్రజల జీవితాలు బాగుపడతాయని ఆశించాడట. కుటుంబం కంటే కూడా పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయించినట్లు తెలుస్తోంది.
పార్టీ కోసమే జీవితం.. సాయం అందలేదా?
స్నేహితులతో కలిసి మాట్లాడేటప్పుడు కూడా ఏ టాపిక్ వచ్చినా మళ్లీ టీఆర్ఎస్ గురించే మాట్లాడేవాడట గురువప్ప. అంతలా పార్టీ మీద అభిమానం పెంచుకున్న గురువప్ప చివరకు అదే పార్టీ జెండాతో సూసైడ్ చేసుకోవడాన్ని సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే పార్టీని ఎంతగానో నమ్మి సేవలందించిన గురువప్పకు ఎలాంటి న్యాయం జరగలేదని తెలుస్తోంది.
కుటుంబ పరిస్థితులు అంతంతమాత్రమే కావడంతో అప్పులు పెరిగినట్లు సమాచారం. మరోవైపు సొంత ఖర్చులతోనే ఎన్నికల ప్రచారం నిర్వహించాడట. పార్టీ నుంచి ఎలాంటి సాయం అందలేదన్నది అతని స్నేహితులు చెబుతున్న మాట. నాయకులతో తన గోడు మొరపెట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం కలగలేదని అంటున్నారు. కార్యకర్తగా పనిచేస్తూనే ఉన్నాడు తప్ప ఎలాంటి పదవులు కూడా ఇవ్వకపోవడం కూడా గురువప్ప మనోవేదనకు కారణంగా తెలుస్తోంది.
ఇక లాభం లేదనుకునే అఘాయిత్యానికి పాల్పడ్డడా..!
పార్టీ కోసం నమ్మకస్తునిగా పనిచేసిన తగిన గుర్తింపు దక్కలేదన్నది గురువప్ప బాధకు కారణంగా కనిపిస్తోంది. పార్టీ కోసం ఎంత చేసినా ఉపయోగం లేకపోవడం గురువప్పను కృంగదీసిందనేది కుటుంబ సభ్యుల ఆరోపణ. ఒకవైపు అప్పులు పెరిగిపోయి మరోవైపు కుటుంబ పరిస్థితులు దిగజారిపోవడంతో ఏం చేయాలో పాలుపోక ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేమోనని స్థానికులు అంటున్నారు.
టీఆర్ఎస్ పార్టీ కోసం తన జీవితం త్యాగం చేసిన గురువప్ప కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ అంటే వల్లమాలిన అభిమానం కనబరిచిన గురువప్పకు పార్టీ తరపున తగిన న్యాయం జరగాలని కోరుకుంటున్నారు.
గురువప్ప మృతిపై అనుమానాలు..!
పార్టీ కార్యాలయంలో జెండాతో ఉరివేసుకుని చనిపోయిన గురువప్ప మృతిపై కొందరు సన్నిహితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గురువప్పను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది వారి వాదనగా కనిపిస్తోంది.
గురువప్ప సూసైడ్ చేసుకున్న ప్రాంతం చిన్నగా ఉందని.. అక్కడ ఆత్మహత్య చేసుకునే ఛాన్స్ లేదని ఆరోపిస్తున్నారు. ఆర్థికంగా తాను బలహీనపడటంతో ఆదుకోవాలని కొందరు నేతలను అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ నేతలు కాదన్నారో ఏమో గానీ.. వారు చేసిన అక్రమాలను బయటపెడతానంటూ గురువప్ప వార్నింగ్ ఇచ్చాడని సమాచారం. దీంతో గురువప్పను చంపి ఇలా సూసైడ్ ప్లాన్ గా చిత్రీకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.