టిఆర్ఎస్ ప్రభంజనం... వెళ్లిపోండి!: రేవంత్ రెడ్డి, నారాయణలు టార్గెట్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలలో అధికార టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. సర్వే ఫలితాలను మించి, విపక్షాలకు అందనంత దూరంలో దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో తెరాస నేతలు టిడిపి నేత రేవంత్ రెడ్డి, సిపిఐ నేత నారాయణలపై మండిపడ్డారు.
మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెరాస కార్యాలయానికి వచ్చారు. తెరాస కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు. ఆనందం పంచుకున్నారు. తెరాస పార్టీ కార్యకర్తలు ఆనందతాండవం చేస్తున్నారు. కెసిఆర్, కెటిఆర్ నేతృత్వంలో పార్టీకి తిరుగులేదని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ... గ్రేటర్ పరిధిలో 100 సీట్లను గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్న రేవంత్ రెడ్డి నల్లమల అడవులకు వెళ్లిపోవాలని సూచించారు. అలాగే టీఆర్ఎస్ ఒంటరిగా గెలిస్తే చెవి కోసుకుంటానని చెప్పిన సీపీఐ నేత నారాయణ చెవి కోసుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీని నేతలు తక్కవ అంచనా వేసినప్పటికీ, ప్రజలు మాత్రం పట్టం కట్టారన్నారు.