ఎమ్మెల్సీ ఎన్నికలను ఆపాలంటున్న కాంగ్రెస్... అభ్యర్ధులను ప్రకటించిన టీఆర్ఎస్
స్థానిక సంస్థల ఎమ్మెల్సి కోటా స్థానాల్లో జరగనున్న ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల పేర్లు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగా ప్రచారం జరిగిన అభ్యర్థులనే కేసీఆర్ ప్రకటించారు. కాగా వరంగల్ నుండి పార్టీ నేత కేటీఆర్ సన్నిహితుడైన వరంగల్ జిల్లాకు చెందిన పోచంపల్లి శ్రీనివాస రెడ్డిని రంగంలోకి దించగా రంగారెడ్డి నుండి మాజీ మంత్రి మహెందర్ రెడ్డి, కాగా నల్గోండ నుండి తేరా చిన్నపరెడ్డిని బరిలోకి దింపారు.
మూడు స్థానాలకు ఉప ఎన్నికలు
ఇక వరంగల్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన కొండా మురళీ కాంగ్రెస్ పార్టీలోకి మారిన నేపథ్యంలో తాను రాజీనామ చేయగా ,రంగారెడ్డి నుండి ఎమ్మెల్సిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి మునుగోడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక రంగారెడ్డి ఎమ్మెల్సి గా ఉన్న పట్నం మహెందర్ రెడ్డి కోడంగల్ శాసన సభ స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి...
మే 31న ఎమ్మెల్సిల ఎన్నికలు
ఈ నేఫథ్యంలోనే తెలంగాణలోని మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సి స్థానాల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో రంగారెడ్డి , నల్గోండ, వరంగల్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రజత్ కుమార్ తెలిపారు. కాగా మే 31న పోలింగ్ జరుగుతుండగా మే 14 నామినేషన్లు ధాఖలు చేయనున్నారు. కాగా జూన్ 3 న ఒట్ల లెక్కింపు జరగనుంది.
ఎమ్మెల్సి ఎన్నికలపై కోర్టుకు వెళ్లనున్న కాంగ్రెస్
కాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. దీంతో ఎన్నికలను ఆపాలంటూ సోమవారం కోర్టులో పిటిషన్ ధాఖలు చేయనుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ఖాలీ అయిన మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సి స్థానాల షెడ్యూల్ను విడుదల చేయడంతో ఎన్నికలను ఆపాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖను సైతం రాశారు. కాగా స్థానిక సంస్థల్లో సరైన ఓటర్ల జాబితా లేవని,కొత్త సభ్యులు వచ్చిన తర్వతే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ వాదిస్తోంది.
ఎన్నికల సంఘం ఏమంటుంది ? జూలై 5వరకు పదవి కాలం...
అయితే రాష్ట్ర్ర ఎన్నికల సంఘం మాత్రం పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని సీఈవో రజత్ కుమార్ చెబుతున్నారు. తమ వద్ద పాత జాబితా ఉందని అంటున్నారు. మరోవైపు స్థానిక సంస్థల సభ్యుల పదవి కాలం జూలై అయిదు వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే కొత్తగా నిర్వహించే ఎన్నికల ఫలితాలను జూన్ 3న ప్రకటిస్తామని చెబుతున్నారు.