పాలేరులో తుమ్మల వర్సెస్ నామా: కెటిఆర్కు గెలుపు బాధ్యత
హైదరాబాద్: వచ్చే మే నెలలో జరుగనున్న ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికలో అధికార టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా జిల్లాకు చెందిన మంత్రి తుమ్మ ల నాగేశ్వర్రావును బరిలో దించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఈ స్థానంలో టిఆర్ఎస్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నందున పోటీ చేయాల్సిందిగా తుమ్మలను సీఎం కోరారు.
అంతేగాక, ఈ ఉపఎన్నికకు పార్టీ ఇంఛార్జ్ బాధ్యతను రాష్ట్ర ఐటీ, పురపాలక, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు అప్పగించారు. జ్వరంతో బాధపడుతున్నా పాలేరు ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ బుధవారం హైదరాబాద్ చేరుకొని మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో ఉప ఎన్నిక విషయమై చర్చించారు.
ఈ స్థానంలో పార్టీ అభ్యర్థి సునాయాసంగా గెలిచే అవకాశం ఉన్న దృష్ట్యా.. పోటీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే ఇక్కడి నుంచి ఎవరిని బరిలో దించాలనే విషయమై సీఎం ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. చివరికి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సరైన అభ్యర్థి అని సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో పాలేరు నుంచి పోటీ చేయాలని కేసీఆర్ స్వయంగా తుమ్మలను కోరారు.
సీఎం ఆదేశాల మేరకు ఉప ఎన్నికలో పోటీ చేయడానికి ఆయన అంగీకరించారు. 2014లో పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి పీఏసీ చైర్మన్ పదవి చేపట్టిన రాంరెడ్డి వెంకట్రెడ్డి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఉప ఎన్నికల్లో పోటీ పెట్టవద్దని కాంగ్రెస్ అధికార పార్టీని ఇప్పటికే కోరినప్పటికీ టిఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
టిడిపి నుంచి బరిలో నామా నాగేశ్వరరావు
పాలేరు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎంపీ, సీనియర్ నేత నామా నాగేశ్వరరావును బరిలోకి దించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలో పట్టున్న నేత కావడంతో నామాను బరిలోకి దించితే ఫలితం ఉంటుందని తెలుగుదేశం అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తుమ్మలకు ధీటైన పోటీ ఇవ్వాలంటే నామానే సరైన అభ్యర్థి అని తెలుగుదేశం అధినాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నామాను బరిలోకి దించాలని నిర్ణయించినట్లు సమాచారం.
కాంగ్రెస్ నుంచి సుచరితారెడ్డి?: పోటీకి టీడీపీ, సీపీఎం, సీపీఐ సిద్ధం
పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా సుచరితారెడ్డిని నిలబెట్టాలని ఆ పార్టీ నాయకత్వం దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇటీవలివరకు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా కొనసాగి, కొద్ది రోజుల క్రితమే మృతి చెందిన రాంరెడ్డి వెంకట్రెడ్డి సతీమణి సుచరితారెడ్డిని పోటీలో దించడం ద్వారా సానుభూతి తోడవుతుందని పార్టీ భావిస్తున్నాయి.
వెంకట్రెడ్డి కుటుంబసభ్యులు కూడా సుచరితా రెడ్డి పేరునే ప్రతిపాదిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. కాగా, వెంకట్రెడ్డికి సోదరుడైన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి ఈ ఉపఎన్నికలో కుటుంబం నుంచి ఎవరిని బరిలో దించాలనే విషయంలో కుటుంబసభ్యులతో చర్చిస్తున్నట్లు సమాచారం.
కాగా, తెలుగుదేశం పార్టీ కూడా పాలేరులో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. సీపీఎం కూడా పాలేరులో పోటీ చేస్తామని ఇదివరకే ప్రకటించింది. ఆ పార్టీ తరఫున పొతినేని సుదర్శన్ ఖరారయ్యే అవకాశాలున్నట్లు తెలిసింది. సీపీఐ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అభ్యర్థి ఎవరనేది తేలలేదు. కాగా, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి గురువారం పార్టీ నేతలతో సమావేశమై అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజీనామా చేయను
రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కెసిఆర్ తనను పాలేరు ఉప ఎన్నికల బరిలో నిలిపారని మంత్రి తుమ్మల చెప్పారు. తమ ప్రభుత్వం చేస్తున్న పనులే తనను గెలిపిస్తాయన్నారు. తాను ఉప ఎన్నికల బరిలో దిగేందుకు ఎమ్మెల్సీ లేదా మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు.