ఉప ఎన్నికల్లో సిపిఐ మద్దతు కోరిన టీఆర్ఎస్...
హుజుర్నగర్ ఉపఎన్నికను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోయిన పరువును తిరిగి రాబట్టుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంటే ..తిరిగి పార్టీకి పునర్వైభవంపై ప్రజల్లో నమ్మకం కలిగే అవకాశాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో చాటిన సత్తాను మరోసారి ఉప ఎన్నికల్లో చాటాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్దం చేస్తోంది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది.
సిపిఐ మద్దతు కోరిన టీఆర్ఎస్
హుజుర్నగర్లో ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి తన ప్రచారాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ గెలుపుకోసం తనతో కలిసి వచ్చే భాగస్వామ్య పార్టీల కోసం మొదటిసారిగా అడుగులు వేస్తోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో పొత్తులు లేకుండా బరిలోకి దిగిన టీఆర్ఎస్ కోసం కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కోసం నల్గోండ జిల్లాలో బలంగా ఉన్నా కమ్యూనిస్టుల మద్దతును కోరుకుంటుంది. ఇందులో భాగంగానే తెలంగాణ ఉద్యమంలో కలిసి పోరాటం చేసిన సిపిఐ మద్దతు కోరేందుకు సిద్దమైంది. ఇందుకోసం సిపిఐ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, లోక్సభ పక్షనేత నామా నాగేశ్వర్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్కు వెళ్లారు.
అక్టోబర్ 1న పార్టీలో చర్చిస్తాం
ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతుపై అక్టోబర్ 1న సీపీఐ రాష్ట్ర కార్యవర్గ భేటీలో చర్చిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్, సీపీఐ పాత మిత్రులమేనని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ను కాపాడేందుకు గతంలో మద్దతు ఇచ్చామని చాడ వివరించారు. అయితే 2019 ఎన్నికల్లో సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. 2014 ఎన్నికల్లో కూడ టీఆర్ఎస్ పార్టీ సిపిఐని కాదని టీఆర్ఎస్ ఒంటరిగానే పోటి చేసిన విషయం తెలిసిందే... మరి ప్రస్తుత ఎన్నికల్లో సిపిఐ మద్దతు ఇస్తుందా లేదా అనేది మరో రెండు రోజుల్లో తేలనుంది.
భవిష్యత్ సంకేతాలు ఎలా ఉంటాయో
అయితే ఎలాంటీ సంకేతాలు లేకుండా టీఆర్ఎస్ నేతలు వెళ్లే అవకాశం లేదనే విషయం స్పష్టం అవుతోంది. అంతర్గత ఒప్పందాలు జరిగిన తర్వాతే... వారిని కలిసేందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తం మీద టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించేందుకు మొదటి సారి టీఆర్ఎస్ పోత్తులను కోరుకోవడంతో ఎలాంటీ సంకేతాలు ప్రజల్లోకి వెళతాయో వేచి చూడాలి.