కలర్ఫుల్: కొలువుదీరిన కొత్త గ్రేటర్: మేయర్గా ఆమె: గులాబీ కండువాలు..కాషాయ తలపాగాలు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్సొరేషన్ కొలువుదీరింది. కొత్త కార్పొరేటర్లతో కళకళలాడుతోంది. 149 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తోన్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్.. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందే కన్ను మూశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే- హైదరాబాద్ నగర్ ప్రథమ పౌరురాలి ఎన్నిక ప్రక్రియ ఆరంభమౌతుంది. హైదరాబాద్ మేయర్గా బంజారాహిల్స్ కార్పొరేటర్, ఆ పార్టీ సీనియర్ నేత కే కేశవరావు కుమార్తె ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డిని ఎన్నుకున్నారు.
హైదరాబాద్ మేయర్ అభ్యర్థినిగా కేకే కుమార్తె..డిప్యూటీగా మోతె శ్రీలత?: గెలుపుపై నో డౌట్స్?
Recommended Video
పండుగ వాతావరణం..
ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిన కార్సొరేటర్లతో గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. కోలాహలంగా మారింది. కొత్త పాలక వర్గం ఏర్పాటు కాబోతోండటంతో కార్యాలయాన్ని అలంకరించారు. తోరణాలు కట్టారు. టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్పొరేటర్లను మినహా మరెవ్వరినీ లోనికి పంపించడానికి సిబ్బంది అంగీకరించలేదు. సాధారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడానికి కుటుంబ సభ్యులకు అనుమతి ఇస్తారు.
స్పెషల్ అట్రాక్షన్గా..
కరోనా ప్రొటోకాల్ మధ్య ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందున కార్పొరేటర్లు మినహా మరెవ్వరికీ అనుమతి ఇవ్వలేదు. టీఆర్ఎస్ కార్పొరేటర్లందరూ గులాబీ కండువాలు, బీజేపీ కార్పొరేటర్లు.. కాషాయరంగు తలపాగాలు ధరించి, అదే రంగు కండువాలను మెడలో వేసుకుని కనిపించారు. ఫలితంగా- గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం మొత్తం కలర్ఫుల్గా మారింది. కార్పొరేటర్ల ప్రమణ స్వీకారానికి ఎక్స్ అఫీషియో హోదాలో టీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కే కవిత హాజరయ్యారు. బీజేపీ తరఫున ఆ పార్టీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ లోక్సభ సభ్యుడు, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జీ కిషన్ రెడ్డి కూడా ఎక్స్ అఫీషియో సభ్యుడే అయినప్పటికీ.. ఆయన పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు.
విజయలక్ష్మి..శ్రీలతా శోభన్ రెడ్డి..
హైదరాబాద్ నగర్ ప్రథమ పౌరురాలిగా కే కేశవరావు కుమార్తె, బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా మోతె శ్రీలతా శోభన్ రెడ్డి ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ సభ్యులు వారి పేర్లను బలపరిచారు. చివరి నిమిషంలో ఏఐఎంఐఎం కార్పొరేటర్లు.. టీఆర్ఎస్కు మద్దతు పలకడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలుత మేయర్ ఎన్నికలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నప్పటికీ.. అనూహ్యంగా వారి మద్దతు టీఆర్ఎస్కు లభించింది. ఫలితంగా- మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సజావుగా సాగింది.