'కొత్త దోస్తీ'తో చక్రం తిప్పుతారా: తెలంగాణపై బీజేపీ 'థర్డ్' ఆలోచన, 20 సీట్లపై కన్ను
Recommended Video
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ అంతగా బలం లేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం ఐదు సీట్లు మాత్రమే గెలిచింది. అదీ హైదరాబాద్ పరిధిలోనే. అయితే ఈసారి కేసీఆర్ పైన వ్యతిరేకత, పరిపూర్ణానంద స్వామి చేరిక వంటి కారణాలతో ఎక్కువ సీట్లు గెలుస్తామని భావిస్తోంది. తెలంగాణలో ఇప్పటికి ఇప్పుడే అధికారంలోకి వస్తామని లేదా ప్రతిపక్షంలో కూర్చుంటామని బీజేపీ భావించడం లేదు.
పైకి టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని చెబుతున్నప్పటికీ.. ప్రధానంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమి, టీఆర్ఎస్ మధ్యే పోటా పోటీ నెలకొనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణలో మూడో ఆలోచన చేస్తోంది. ఫలితాల్లో ఏ పార్టీకి మెజార్టీకి కావాల్సిన సీట్లు రాకుంటే తాము టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి చక్రం తిప్పవచ్చునని భావిస్తోంది.
చక్రం తిప్పవచ్చుననే ఆలోచన
పరిణామాలు చూస్తుంటే ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చేలా లేదని భావిస్తున్నారు. టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలు 40, 50 సీట్లకు అటు ఇటుగా ఆగిపోతాయాని భావిస్తున్నారు. తమకు బలం ఉన్న చోట మంచి అభ్యర్థులను నిలబెట్టి దాదాపు 10 స్థానాల్లో గెలవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో తెరాసకు మద్దతిచ్చి చక్రం తిప్పవచ్చుననే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. బీజేపీ ఊహించినట్లుగా కింగ్ మేకర్ అవుతుందా లేదా అనేది ఫలితాలు వెల్లడయ్యాక తెలుస్తుంది. అయితే ఆరేడు సీట్లు తెరాసకు తక్కువ పడితే మజ్లిస్ మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది. అప్పుడు బీజేపీ అవసరం రాదు కూడా.
టిక్కెట్లపై ఎక్కువ ఆశలొద్దు.. 18సీట్లతో సర్దుకుపోదాం, కాంగ్రెస్ గెలుపు ముఖ్యం!: బాబు షాకింగ్
ఎవరితో కలవకపోవడమూ కారణం
ఓ వైపు టీడీపీ, కాంగ్రెస్ వంటి పార్టీలకు తోడు తెలంగాణ జన సమితి, సీపీఐలు కలిసి పోటీ చేస్తుంటే టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తోంది. దీని వల్ల టీఆర్ఎస్కు నష్టమని భావిస్తున్నారు. ఒకవేళ మహాకూటమి ముక్కలయితే మాత్రం టీఆర్ఎస్కు లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. మహాకూటమితో టీఆర్ఎస్కు జరిగే నష్టాన్ని ఎన్నికల ఫలితాల తర్వాత తాము భర్తీ చేస్తే పార్టీకి తెలంగాణలో, జాతీయస్థాయిలో లబ్ధి చేకూరుతుందని బీజేపీ భావిస్తోందట.
15 నుంచి 20 సీట్లపై బీజేపీ కన్ను
తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నిన్నటి వరకు 90 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సీట్లు 60. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని సీట్లు ఏ పార్టీకి రావనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ ప్రధానంగా 15 నుంచి 20 సీట్ల పైన ప్రత్యేక దృష్టి సారించింది. ఎట్టి పరిస్థితుల్లో పది స్థానాలకు పైగా గెలవాలని భావిస్తోంది. అప్పుడే అవసరమైతే కింగ్ మేకర్ కావొచ్చునని భావిస్తోంది. 7 స్థానాలు దాదాపు పక్కాగా గెలిచే మజ్లిస్ కూడా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు కొట్టి పారేయలేం.
హంగ్ వస్తుందని భావిస్తున్నాం
తెలంగాణ రాష్ట్రంలో హంగ్ వస్తుందని భావిస్తున్నామని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ 37 మంది అభ్యర్థులను ప్రకటించింది.
తెలంగాణలో ఎల్జేపీ పోటీ
లోక్ జనతంత్రి పార్టీ (ఎల్జేపీ) కూడా తెలంగాణలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడి నుంచి వివరాలు కోరినట్లు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ 'వన్ ఇండియా'తో చెప్పారు. ఇక్కడ పార్టీ పరిస్థితి, ఎక్కడ పట్టు ఉందనే అంశాలపై అడిగానని, కుదురితే బీజేపీతో కలిసి వెళ్తామని లేదంటే బలం ఉంటే ఒంటరిగా ముందుకు సాగుతామన్నారు. పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న అభ్యర్థులను నిలబెడతామన్నారు. ఎన్డీయేలో ఎల్జేపీ భాగస్వామి. కాబట్టి తెలంగాణలో బీజేపీతో కలిసి వెళ్లే అవకాశాలు ఉంటాయి. తెలంగాణలో బీజేపీకి ఏ రకంగా చూసినా తెరాస లేదా ఎల్జేపీతో కలిసి పోటీ చేస్తే కొత్త దోస్తీయే అవుతుంది.