నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్ :హుజూర్ నగర్ లో సైదిరెడ్డి ఆధిక్యం ఇలా.. : కలిసొచ్చిన అంశాలేంటి..!
హుజూర్ నగర్ లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. తొలి రౌండ్ లో అధికార టీఆర్ యస్ పార్టీ..ప్రతిపక్ష కాంగ్రెస్ హోరా హోరీగా తొలుత కనిపించినా..రౌండ్ ముగిసే సరికి మాత్రం టీఆర్ యస్ అభ్యర్ధి సైదిరెడ్డి 2467 ఓట్లు ఆధిక్యత సాధించారు. మొత్తం 14 రౌండ్లు కౌంటింగ్ కొనసాగనుంది. పోస్టల్ బాలెట్ తో పాటుగా తొలి రౌండ్ లో సైదిరెడ్డి అధిక్యత కొనసాగింది. ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి తన విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెండో రౌండ్ పూర్తయ్యే సరికి సైదిరెడ్డి నాలుగు వేల 700 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ ముగిసే సరికి 6700 ఓట్ల మెజార్టీతో దూసుకు వెళ్తున్నారు. దీంతో..ఎగ్జిట్ పోల్స్ నిజమవుతూ..ప్రతపక్షాలను షాక్ ఇస్తూ హుజూర్ నగర్ లో కారు దూసుకు వెళ్తోంది.
ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్వైపే
రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలు హుజూర్ నగర్ ఉప ఎన్నిక పైన ఎగ్జిట్ పోల్స్ నిర్వహించగా.. అన్ని ఫలితాలూ అధికార టీఆర్ఎ్సకు అనుకూలంగానే ఉన్నాయి. దానికి తగినట్లుగానే ఇప్పుడు ట్రండ్స్ కొనసాగుతున్నాయి. చాణక్య ఎగ్జిట్ పోల్లో టీఆర్ఎ్సకు 53 శాతం, కాంగ్రె్సకు 41 శాతం, టీడీపీకి 2.1 శాతం, బీజేపీకి 1.1 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఆరా అనే ఏజెన్సీ చేసిన సర్వేలో టీఆర్ఎ్సకు 50.48 శాతం, కాంగ్రె్సకు 39.95 శాతం, ఇతరులకు 9.57 శాతం ఓట్లు పోల్ అవుతాయని పేర్కొంది. ‘వీసీపీ' అనే సంస్థ టీఆర్ఎ్సకు 57.73 శాతం, కాంగ్రె్సకు 41.04 శాతం, టీడీపీకి 2.21 శాతం, బీజేపీకి 1.17 శాతం, ఇతరులకు 1.84 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. రిసెర్చ్ అండ్ అనాలసిస్ బై పబ్లిక్ పల్స్ అనే సంస్థ టీఆర్ఎ్సకు 49.3%, కాంగ్రె్సకు 41.8%, టీడీపీకి 4.8%, బీజేపీకి 2.4%, ఇతరులకు 1.7% వస్తాయని పేర్కొంది. దీంతో పాటుగా ఈ అంచనాలు రాక ముందే మంత్రి కేటీఆర్ తమ పార్టీ గెలుపు ఖాయమని ట్వీట్ చేసారు.
ఇప్పటికే 6700 ఓట్ల మెజార్టీ..
ఉప ఎన్నిక కౌంటింగ్ లో తొలుత నేరేడుచర్ల మండలం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై వరుసగా పాలకీడు, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, హుజూర్నగర్ మండలం, పట్టణం, గరిడేపల్లి మండలంలోని లెక్కింపుతో పూర్తవుతుంది. అయితే, తొలి మూడు రౌండ్లలోనూ పూర్తిగా అధికార పార్టీ టీఆర్ యస్ ఆధిక్యత కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్.. తొలి రెండు రౌండ్లలోనూ అధికార పార్టీ అభ్యర్ధి సైదిరెడ్డి నాలుగు వేల 700 ఓట్లకు పైగా మెజార్టీ సాధించారు. మూడో రౌండ్ ముగిసే సరికి 6700 ఓట్ల మెజార్టీతో దూసుకు వెళ్తున్నారు.
సానుభూతి కలిసివచ్చిందా..
రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె..ప్రతిపక్షాలు మొత్తంగా అధికార పార్టీని కేంద్రంగా చేసుకొని ఆరోపణలు చేస్తున్న సమయంలో..ఖచ్చితంగా అధికార పార్టీకి షాక్ తప్పదని భావించారు. కాంగ్రెస్ కు కంచుకోటగా నిలిచిన హుజూర్ నగర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పార్టీకి అవకాశం ఇవ్వకూడదని కాంగ్రెస్ నేతలు గట్టిగానే ప్రయత్నాలు చేసారు. అయితే, గత ఎన్నికల్లో సైదిరెడ్డి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అక్కడ ట్రక్కు గుర్తు కారణంగానే..సైదిరెడ్డి ఓడిపోయారనే అంశాన్ని ఆ పార్టీ నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీని ద్వారా సైదిరెడ్డికి అక్కడ సానుభూతి కలిసి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీ గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఏడు మండలాల్లో నేతలకు బాధ్యతలు అప్పగించారు. అది పూర్తిగా వర్కవుట్ అయినట్లుగా కనిపిస్తోంది. మొత్తంగా మధ్నాహ్నానికి పూర్తి ఫలితం వెల్లడికానుంది.