టీఆర్ఎస్ఎల్పీగా కేసీఆర్ ఏకగ్రీవం, కేబినెట్లోకి మహిళా ఎమ్మెల్యే!: ఏపీలో వెలమ యూత్ ఫ్లెక్సీలు
Recommended Video
హైదరాబాద్/విజయవాడ: తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. 119 అసెంబ్లీ స్థానాలు ఉన్న తెలంగాణలో మేజిక్ ఫిగర్ 60. 2014లో టీఆర్ఎస్ 63 స్థానాలు గెలుచుకోవడంతో పాటు దాదాపు ఇరవై ఐదు మందికి పైగా ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి చేరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018లో గెలిచిన అభ్యర్థులు (ఫోటోలు)
గెలిచిన తెరాస సభ్యులు ప్రగతి భవన్లో బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ తరఫున గెలిచిన 88 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ఎల్పీగా కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రొటెం స్పీకర్ను కూడా అభ్యర్థులు ఎన్నుకోనున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
రేపు సీఎంగా ప్రమాణం
కేసీఆర్ ప్రభుత్వం గురువారం కొలువుదీరనున్న విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది. కేసీఆర్తో పాటు మరొకరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. నలుగురు మంత్రులు ఓడిపోయినందున వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసుకోవడంతో పాటు ప్రస్తుతం ఉన్న వారిలో కొందరిని మార్చే అవకాశముంది.
18 మందికి అవకాశం, మహిళల్లో ఎవరికి ఛాన్స్?
కేసీఆర్ మంత్రివర్గంలో 18 మందికి అవకాశం దక్కనుందని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన జూపల్లి కృష్ణా రావు, చందూలాల్, తుమ్మల నాగేశ్వర రావు తదితరులు నలుగురు ఓడిపోయారు. వారి స్థానంలో వేరేవారిని తీసుకోవడంతో పాటు, కొందరిని మార్చనున్నారని సమాచారం. ఈసారి మహిళలకు అవకాశం ఇవ్వవచ్చు. గత ప్రభుత్వంలో మహిళలకు చోటు కల్పించలేదు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఖానాపూర్ నుంచి రేఖా నాయక్, ఆలేరు నుంచి గొంగిడి సునీత, మెదక్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డిలు గెలిచారు. ఇందులో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.
కేటీఆర్కు సానియా మీర్జా సహా అభినందనల వెల్లువ, ఎంపీ కవిత ఏమన్నారంటే
సభలో నేనే సీనియర్
టీఆర్ఎస్ఎల్పీగా ఎన్నికైన అనంతరం కేసీఆర్ మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడారు. లెక్క ప్రకారం తాము 95 నుంచి 106 సీట్లు గెలవాల్సి ఉందని చెప్పారు. ఖమ్మంలో అంతర్గత విభేదాలతో ఓడిపోయామని చెప్పారు. గెలిచిన వాళ్లే కాదు గెలవని వాళ్లు కూడా తనకు ముఖ్యమేనని చెప్పారు. గెలవని వాళ్లను కూడా కలవాలని, వాళ్లతో మాట్లాడాలన్నారు. మా పార్టీలో ఇంకా చాలామంది చేరబోతున్నారని సంకేతాలు ఇచ్చారు. సభలో తాను సీనియర్ ఎమ్మెల్యేను అన్నారు. తన తర్వాత రెడ్యా నాయక్, ఎర్రబెల్లి దయాకర రావు సీనియర్లు అన్నారు. అసదుద్దీన్ ఓవైసీతో జాతీయ రాజకీయాల గురించి మాట్లాడానని చెప్పారు.
ఏపీలో వెలమ యూత్ ఫ్లెక్సీలు
కేసీఆర్ తెలంగాణ సీఎంగా రెండోసారి కావడంపై తెలంగాణతో పాటు ఏపీలోను కొందరు సంబరాలు చేసుకుంటున్నారు. కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో కొందరు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తూ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్కు శుభాకాంక్షలు అంటూ వెలమ యూత్, గుడివాడ అని ఈ ఫ్లెక్సీలో పేర్కొన్నారు.