రాజీనామాకు గుత్తా ఓకే: నల్గొండపై కెసిఆర్ ప్లాన్ ఇదే, విపక్షాలకు దెబ్బేనా?
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్లో చేరిన నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్రెడ్డి తన ఎంపీ పదవికి త్వరలో రాజీనామా చేస్తారని టిఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గుత్తా రాజీనామాతో నల్గొండలో ఉపఎన్నికలు అనివార్యం కానున్నాయి. అయితే నల్గొండ ఉపఎన్నికల్లో విపక్షాలకు దిమ్మతిరిగే షాకిచ్చేందుకు టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ వ్యూహరచన చేస్తున్నారు.దసరా తర్వాత కెసిఆర్ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. గుత్తా రాజీనామాకు ముందే నల్గొండ జిల్లాలో అభివృద్ది పనులకు సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టనున్నారు.
నల్గొండ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించిన గుత్తా సుఖేందర్రెడ్డి ఇటీవలనే కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్లో చేరారు. రైతుసమితిల రాష్ట్ర కన్వీనర్గా గుత్తా సుఖేందర్రెడ్డిని నియమించనున్నారు. క్యాబినెట్ హోదా కల్పించనున్నారు. రాష్ట్ర రైతు సమితుల కన్వీనర్గా సుఖేందర్రెడ్డి ఎన్నికైన తర్వాత నల్గొండ ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది.
నల్గొండ ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విపక్షాలకు దిమ్మతిరిగే షాకివ్వాలని కెసిఆర్ వ్యూహరచన చేస్తున్నారు.2019 సార్వత్రిక ఎన్నికలకు నల్గొండ ఉపఎన్నికలు ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
గుత్తా రాజీనామా చేసి ఎన్నికలు జరిగే పరిస్థితి వస్తే విపక్షాలకు మాత్రం ఒక రకంగా అగ్ని పరీక్షే. ఇప్పటికే తెలంగాణలో విపక్షాలకు ఇబ్బందికర పరిస్థితులున్నాయనే వాతావరణాన్ని కెసిఆర్ కల్గించారు.
నల్గొండ ఉపఎన్నికలపై పార్టీల తలమునకలు
నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి రాజీనామా చేస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులపై రాజకీయపార్టీలు సతమతమౌతున్నాయి. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే నల్గొండ ఎంపీ స్థానం నుండి పోటీచేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థి ఎవరనేది మాత్రం ఇంకా చర్చ లేదు. బిజేపీ, వామపక్షాలతో కలిసి టీ మాస్ ఫోరం అంతా.. అంతర్గత సమాలోచనల్లో మునిగితేలుతున్నారు. బయటికి వ్యూహాలను వెల్లడిచేయకపోయినా... ఎవరికి వారే కసరత్తులు ప్రారంభించినట్లు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
రాజీనామాపై గుత్తా సానుకూల సంకేతాలు
నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం సాగుతోంది.రాజీనామాపై మీడియాతో గుత్తా సుఖేందర్రెడ్డి నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు.
అన్నింటికి పార్టీనే సమాధానం చెబుతుందంటూ రాజీనామాపై సుఖేందర్ నవ్వుతూ వ్యాఖ్యలు చేశారు. సుఖేందర్రెడ్డి రాజీనామాకు సిద్దంగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
నల్గొండపై టిఆర్ఎస్ గురి
నల్లగొండ ఉప ఎన్నికతో రాష్ట్రంలోని పలు సవాళ్లకు, విపక్షాల ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని సీఎం కెసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు కెసిఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నల్లగొండ ప్రజల అవసరాలు ఏంటి?... తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలు ఏవి ? వాటి నిధుల అవసరాలు ఏంటీ అంటూ గత కొద్ది రోజులుగా ఆరా తీస్తున్నారు.. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో ఇప్పటికే పలు మార్లు సమీక్షించారు. నేరుగా జిల్లా కలెక్టర్ తోనూ సీఎం కెసిఆర్ పలుమార్లు మాట్లాడి జిల్లాలో పెండింగ్ లో ఉన్న అంశాలపై ఆరా తీశారు. అందుకు సంబందించిన ప్రణాళికలు సిద్దం చేయమని ఆదేశించారు.
పెండింగ్ ప్రాజెక్టుల్లో కదలిక
నల్గొండ ఉపఎన్నిక వస్తే ఏ రకమైన వ్యూహన్ని అనుసరించాలనే దానిపై కెసిఆర్ ప్లాన్ చేస్తున్నారు. తొలి దశలో 500కోట్ల విలువైన అభివృద్ది పనులకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ జిల్లాకు త్వరలోమెడికల్ కాలేజీ, ఐటీ పార్క్ అంటూ ప్రకటనకు రంగం సిద్దం చేశారు. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయ్యింది. పది వేల డబుల్ బెడ్ రూం ఇళ్ళు, శిల్పారామం ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది.టౌన్ హాల్ను రవీంద్రభారతి తరహాలో నిర్మించేందుకు డిజైన్లు ఖరారు చేశారు.
దసరా తర్వాత నల్గొండకు కెసిఆర్ టూరు
మెడికల్ కాలేజీ ప్రకటిస్తే... దానికి అనుబంధ ఆస్పత్రిగా జిల్లా కేంద్రం ఆస్పత్రిని తీర్చిదిద్దేందుకు అవసరమైన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొత్తగా మాతాశిశు సంక్షేమ కేంద్రం, అదనంగా 150 పడకలతో ఆస్పత్రి నూతన భవనం నిర్మాణాలు పూర్తయ్యి ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో మిగిలి ఉన్న పనులను పూర్తి చేసేందుకు కూడా నిధులు మంజూరు చేశారు. దసరా అనంతరం నల్లగొండ పర్యటనలో సీఎం కెసిఆర్ తో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పూర్తి చేయాలన్న యోచనలో టీఆర్ఎస్ ముఖ్యులు ఉన్నారు.