నాడు ఆర్ డి ఓ, నేడు బత్తాయి మార్కెట్, నల్గొండ ఘటనకు కారణమేమిటీ?
నల్గొండలో బత్తాయి మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఆధిపత్యపోరుకు వేదికగా మారింది. మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభానికి ముందే కాంగ్రెస్, టిఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై
నల్గొండ: నల్గొండలో బత్తాయి మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఆధిపత్యపోరుకు వేదికగా మారింది. మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభానికి ముందే కాంగ్రెస్, టిఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై మరోకరు రాళ్ళురువ్వుకొన్నారు. గంటకు పైగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఎమ్మెల్యే కోమటిరెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు.
నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో బత్తాయి మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం మంగళవారం జరిగింది.అయితే ఈ కార్యక్రమానికి హజరౌతున్న మంత్రి హారీష్ రావుకు తాను అభినందన తెలుపుతానని కోమటిరెడ్డి ప్రకటించారు.ఈ మేరకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేశారు.
మంత్రి హారీష్ రావు నల్గొండకు సమీపంలోని మర్రిగూడ బైపాస్ రోడ్డువద్దే ఎమ్మెల్యే వెంకట్ రెడ్డి తన అనుచరులతో కలిసి స్వాగతం పలికారు. అక్కడినుండి ర్యాలీగా మార్కెట్ శంకుస్థాపన జరిగే గంధంవారి గూడెం వద్దకు తన అనుచరులతో కలిసి ర్యాలీగా బయలుదేరివెళ్ళాడు.
అయితే మార్కెట్ శంకుస్థాపన సభ ప్రాంగణంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రతిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడ నినాదాలు చేశారు. ఇరువర్గాల నినాదాలతో పాటు ఒకరిపై మరోకరు రాళ్ళదాడికి దారితీసింది.
అయితే నల్గొండ ఎమ్మెల్యే వెంకట్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోనేందుకు ప్రయత్నించారని టిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తుండగా, తనను ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా టిఆర్ఎస్ నాయకులు ఉద్దేశ్యపూర్వకంగానే ప్రయత్నించారని ఎమ్మెల్యే వెంకట్ రెడ్డి ఆరోపించారు.
ఆర్ డి ఓ ప్రారంభోత్సవం ..నేడు బత్తాయి మార్కెట్ శంకుస్థాపన
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నల్గొండలో ఆర్ డి ఓ కార్యాలయాన్ని పూర్తి చేసినప్పటికీ దాన్ని ప్రారంభించలేదు.అయితే మంత్రులకు సమయం కుదరడం లేదంటూ , ఇతరత్రా కారణాలతో ప్రారంభోత్సవాన్ని వాయిదావేస్తున్నారంటే నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ కార్యాలయాన్ని గతంలో ప్రారంభించారు.అయితే ఈ విషయమై ఆయనపై కేసు నమోదైంది.ఈ ఘటన ప్రోటోకాల్ వివాదాలు చోటుచేసుకొన్నాయి. కొన్ని కార్యక్రమాలకు తాను దూరంగానే ఉంటున్నానని వెంకట్ రెడ్డి చెబుతున్నారు. అదే సమయంలో బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సమయంలో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో రాళ్ళ దాడి జరగడంతో దానిలో పాల్గొనకుండానే కోమటిరెడ్డి వెనుతిరగాల్సి వచ్చింది.
ఆధిపత్యపోరుతో నల్గొండలో ఉద్రిక్త పరిస్థితులు
బత్తాయి మార్కెట్ శంకుస్థాపన సందర్భంగా కాంగ్రెస్, టిఆర్ఎస్ లు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించాయి. మంగళవారం నాడు మధ్యాహ్నం నుండే నల్గొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మర్రిగూడ బైపాస్ రోడ్డు నుండి నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అనుచరులతో ర్యాలీగా క్లాక్ టవర్ చేరుకొన్నారు. అక్కడ మరికొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయనకు తోడయ్యారు. వారంతా గంధంవారిగూడెం చేరుకొన్నారు. అయితే అప్పటికే అక్కడ కొందరు టిఆర్ఎస్ కార్యకర్తలున్నారు. టిఆర్ఎస్ నల్గొండ ఇన్ చార్జ్ దుబ్బాక నర్సింహ్మారెడ్డి తన అనుచరులతో కలిసి బైక్ ర్యాలీతో సభ ప్రాంగణానికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోమటిరెడ్డి గో బ్యాక్ అంటూ టిఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడ ప్రతిగా నినాదాలు చేశారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్ళురువ్వుకొన్నాయి.
ఎవరీ దుబ్బాక నర్సింహ్మారెడ్డి
టిఆర్ఎస్ నల్గొండ అసెంబ్లీ ఇంచార్జ్ దుబ్బాక నర్సింహ్మారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు.1999లో నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తొలిసారిగా పోటీచేసిన సమయంలో దుబ్బాక నర్సింహ్మారెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వెంకట్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపులో ఆయన కీలకపాత్ర పోషించారు. అయితే ఆయన పిఆర్పీలో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమాల్లో పనిచేస్తూ ఆయన టిఆర్ఎస్ లో చేరారు. నల్గొండ అసెంబ్లీ ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా దుబ్బాక నర్సింహ్మారెడ్డి పోటీచేసి మూడవస్థానంలో నిలిచారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధర్నా
బత్తాయి మార్కెట్ ప్రారంభోత్సవ సభ ప్రాంగణం నుండి తనను బలవంతంగా తొలగించడాన్ని నిరసిస్తూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దేవరకొండ రోడ్డులోని వైఎస్ఆర్ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు. అయితే జిల్లా ఎస్పీ అక్కడకు చేరుకొని కోమటిరెడ్డికి సర్ధిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఆయన వినకపోవడంతో అరెస్టు చేసి మిర్యాలగూడ డిఎస్పీ కార్యాలయానికి తరలించారు.