గణేష్ ఉత్సవాల నిర్వహణ మీద టీఆర్ఎస్ కుట్రలు ఊరుకోం : బండి సంజయ్
గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడంపై ఆంక్షలు పెట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఎంఐఎం చేతిలో టిఆర్ఎస్ పార్టీ కీలుబొమ్మగా మారిందని ఆయన ఆరోపించారు. బాలగంగాధర్ తిలక్ ఆదర్శాలను హిందూ సమాజం అనుసరిస్తోందని, ఘనంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవడానికి సిద్ధంగా ఉందని, అందుకు బిజెపి అండగా నిలుస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
Recommended Video
గణేష్ నవరాత్రి ఉత్సవాల మీద టిఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలను దీటుగా ఎదుర్కొంటామని ఆయన పేర్కొన్నారు. లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు అవుతున్న సమయంలో రంజాన్ మాసం రావడంతో బిర్యానీలు , కాజు పిస్తాలు అందించిన టిఆర్ఎస్ ప్రభుత్వం గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కనీసం పులిహోర కూడా నైవేద్యంగా సమర్పించే అవకాశం లేకుండా ఆంక్షలు విధిస్తుంది అని ఆయన మండిపడ్డారు. సాంప్రదాయ పద్ధతిలో ఎవరికీ ఇబ్బందులు కలిగించకుండా ఉత్సవాలు నిర్వహించటం హిందూ సమాజానికి అలవాటని, దానిని అడ్డుకుంటే హిందూ సమాజం సహించదని హెచ్చరించారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక వర్గాన్ని మచ్చిక చేసుకోవడం కోసమే గణేశ్ ఉత్సవాల మీద అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.పోలీసులతో నిర్వాహకులపై బెదిరింపులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని, ఎవరైనా ఉత్సవ సమితుల నిర్వాహకులను పోలీసులు ఇబ్బంది పెడితే బీజేపీ నాయకులను సంప్రదించాలని ఆయన కోరారు.
సమాజాన్ని సంఘటితం చేసే గణేష్ ఉత్సవాలను కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ నిర్వహించుకోవాలని ఆయన అన్నారు. హిందూ సమాజం సామాజిక సంఘటిత శక్తిగా మారి గణేష్ ఉత్సవాలకు అడ్డంకిగా మారిన తెలంగాణ ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధం కావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు.