రూ.10లక్షలిస్తేనే ఇల్లు కట్టుకుంటావ్?: టీఆర్ఎస్ కార్పొరేటర్ బెదిరింపు, రాళ్ల దాడి
రూ. 10లక్షలిస్తేనే ఇల్లు కట్టుకునేందుకు సహకరిస్తామని ఓ ఇంటి యజమానిని బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో టీఆర్ఎస్ కార్పొరేటర్ విఠల్ రెడ్డిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: రూ. 10లక్షలిస్తేనే ఇల్లు కట్టుకునేందుకు సహకరిస్తామని ఓ ఇంటి యజమానిని బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో టీఆర్ఎస్ కార్పొరేటర్ విఠల్ రెడ్డిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తనకు చెప్పకుండా ఇంటి నిర్మాణం చేపట్టావంటూ 30మంది అనుచరులతో వచ్చిన విఠల్ రెడ్డి తనపై దాడికి పాల్పడ్డాడని బాధిత యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విఠల్ రెడ్డిపై కేసు నమోదైంది.
చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్రెడ్డి అనుచరగణం శుక్రవారం రాత్రి సాగించిన ఈ దౌర్జన్యకాండపై విమర్శలు చెలరేగుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. చైతన్యపురి హనుమాన్నగర్కు చెందిన విక్రాంత్ గడ్డిఅన్నారంలో ప్రైవేటు పాఠశాల నిర్వహిస్తున్నారు.
హనుమాన్నగర్లో సొంత ఇంటి నిర్మాణం కోసం ఇటీవలే పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న విఠల్రెడ్డి, మాజీ కౌన్సిలర్ తులసీదాస్ తమ అనుచరులతో కలిసి శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో నిర్మాణ స్థలం వద్దకు వెళ్లారు. తొలుత అక్కడ పనిచేస్తున్న కూలీలను బూతులు తిట్టారు.
'మా అనుమతి లేకుండా పనులెలా చేస్తార్రా..?' అంటూ పరుషపదజాలంతో దూషించారు. వారి ధాటికి భయపడిన కూలీలు విక్రాంత్కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న విక్రాంత్తోనూ విఠల్రెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు. జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నానని.. కమీషన్ ఇచ్చేది లేదని విఠల్రెడ్డికి తెగేసి చెప్పారు.
ఈ క్రమంలో వాదనలు తారస్థాయికి చేరుకున్నాయి. దీంతో విక్రాంత్పైనా రాళ్లు రువ్వారు కార్పొరేటర్ అనుచరవర్గం. ఈలోగా పోలీసులు రావడంతో పరిస్థితి సద్దుమణిగింది.
అనంతరం బాధిత యజమాని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కార్పొరేటర్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. కాగా, గొడవ జరుగుతుండటంతో ఆపేందుకు మాత్రమే తాను అక్కడికి వెళ్లానని.. అకారణంగా తనపై తప్పుడు ఫిర్యాదు చేశారంటూ విఠల్రెడ్డి ప్రతిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.