అవిశ్వాస తీర్మానం: టీఆర్ఎస్కు కాంగ్రెస్ షాక్, ప్లాన్తో ముందే హిమాచల్ ప్రదేశ్కు
వరంగల్: పరకాల మున్సిపల్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం గురువారం వీగిపోయింది. కోరం లేకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ను దింపేందుకు టీఆర్ఎస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేసింది.
కానీ, ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకి చెందిన కౌన్సెలర్లను హిమాచల్ ప్రదేశ్ తరలించింది. వారిని ప్రత్యేకంగా హెలికాప్టర్లు లేదా విమానాలలో తరలించినట్లుగా తెలుస్తోంది. దీంతో కోరం లేక అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. పలువురు కాంగ్రెస్ కౌన్సెలర్లకు తెరాస గాలం వేసింది. కానీ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి అధికార పార్టీ ప్లాన్కు దెబ్బకొట్టింది.
పరకాల మున్సిపల్ చైర్మన్ పైన కొద్ది రోజుల క్రితం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీని కోసం వేచి చూస్తున్నారు. ఈ రోజు సమావేశానికి కేవలం ఇద్దరు కౌన్సెలర్లు మాత్రమే హాజరు కావడంతో.. కోరం లేక అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు.
చైర్మన్ రాజభద్రయ్య, వైస్ ఛైర్మన్ దేవునురి రమ్యకృష్ణపై టీఆర్ఎస్ కౌన్సిలర్లు తీర్మానం ప్రవేశపెట్టారు. ఎన్నికల అధికారిగా ఆర్డీవో జి మహేందర్ వ్యవహరించారు. అవిశ్వాసం సందర్భంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.