టీఆర్ఎస్ కు అంతు చిక్కని మునిసి‘పల్స్’:రంగంలోకి సర్వే సంస్థలు: నివేదికలతో అభ్యర్ధుల ఎంపిక..!
తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు ఇప్పుడు అధికార టీఆర్ఎస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 31 జిల్లాల్లో గెలిచిన టీఆర్ఎస్..ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల్లోనూ అదే రకంగా సత్తా చాటా లని భావిస్తోంది. అయితే, సాధారణంగా వ్యూహల ఖరారు.. అభ్యర్ధుల ఎంపికలో టీఆర్ఎస్ అధినాయకత్వం అంచనాలకు తగ్గట్లుగానే ఫలితాలు సాధించేది.
కానీ, ఇప్పుడు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. వరుసగా రెండో సారి అధికారంలో కొనసాగటం..అర్బన్ ఓటింగ్ కావటంతో..జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒక విధంగా టీఆర్ఎస్ కు మునిసి పల్స్ అందనట్లుగా కనిపిస్తోంది. దీని కోసమే అభ్యర్ధుల ఎంపిక మొదలు .. గెలుపు వ్యూహాల..కార్యాచరణ వరకు పార్టీతో పాటుగా సర్వే సంస్థల సహకారం తీసుకుంటుంది. ఆ సంస్థలు ఇచ్చే నివేదిక ఆధారంగానే అభ్యర్ధులు ఖరారయ్యే అవకాశం ఉంది.
ఓటర్ల నాడి పట్టేందుకు సర్వే సంస్థలు..
మున్సిపల్ పోల్స్ సమీపించాయి. దీంతో..ఓటర్ల నాడి పట్టేందుకు అధికార టీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీని కోసం సర్వే సంస్థలను ఎంపిక చేసుకొంది. మూడు సర్వే సంస్థలను రంగంలోకి దింపిన ట్లుగా తెలుస్తోంది. ఒక సర్వే కోసం పార్టీ ముఖ్య నేతలను వినియోగిస్తోంది. మరొకటి పోలీస్ నిఘా విభాగం నుంచి తెప్పిస్తోంది. స్వతంత్ర ఏజెన్సీ ద్వారా మూడో సర్వే చేయిస్తోంది.
సేకరించాల్సిన సమాచారం ఒకటే అయినప్పటికీ.. వేర్వేరు సంస్థల ద్వారా జరుగుతున్న ఈ మూడు సర్వేలూ దాదాపు పూర్తి అవుతున్నట్లు సమాచారం. ఈ సర్వే ప్రక్రియ...ఎప్పటికప్పుడు అందుతున్న సమచారాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మంత్రి కేటీఆర్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా మొత్తం అన్ని మున్సిపాల్టీల నుండి ఎంపిక చేసిన నేతలు టఫ్ పైట్ గా భావిస్తున్న ప్రాంతాల నుండి సమాచారం సేకరిస్తున్నారు. ఇందు కోసం 30 టీఆర్ఎస్ నేతలతో గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు.
వాటి ఆధారంగానే అభ్యర్ధుల ఖరారు..
లోక్సభ నియోజకవర్గం యూనిట్గా మునిసిపాలిటీల్లో సర్వే నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకత్వానికే మళ్లీ అక్కడ సర్వే చేసే బాధ్యతను అప్పగించారు. ఈ మేరకు ప్రతి లోక్సభ నియోజకవర్గానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిని ఇన్చార్జిగా నియమించి, ఇద్దరు-ముగ్గురు రాష్ట్ర కార్యదర్శులకు ఆ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. డివిజన్ల వారీగా ఎవరెవరి మధ్య పోటీ ఉంటుందనే అంశంతో పాటుగా టీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎవరైతే బాగుంటుందో కూడా నివేదికలో పొందుపర్చాలని కోరారు.
వార్డులు, డివిజన్లలో జనాభా ఆధారంగా రిజర్వేషన్ ఎవరికి వస్తుందనేది అంచనా వేసి.. టికెట్ ఎవరికి ఇవ్వాలో ఒక్కో వార్దుకు మూడు పేర్లు సూచించాలని ఆదేశించినట్లు సమాచారం. మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి ఈ నెల 31లోగా నివేదికలు అందించాలని పార్టీ నేతలను అధిష్ఠానం ఆదేశించింది. అప్పటిలోగా సర్వే నివేదికలు సైతం అందనున్నాయి. వాటన్నింటినీ సమగ్రంగా పరిశీలించి స్పష్టమైన అంచనాకు రావాలని భావిస్తున్నారు.
క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో..
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జనవరి 7న నోటిఫికేషన్ వెలువడనుంది. 22న పోలింగ్ జరగనుంది. పరిషత్ ఎన్నికల తరహాలోనే మునిసిపల్ ఎన్నికలనూ క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో టీఆర్ఎస్ అధిష్ఠానం ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థులు మునిసిపల్ ఎన్నికల్లో గెలవడానికి ఏం చేయాలన్న అంశాన్నే ఈ సర్వేలకు ప్రధానంగా నిర్దేశించినట్లు తెలుస్తోంది.
మునిసిపాలిటీల వారీగా పార్టీల బలాబలాలను సూచించాలని.. అదే సమయంలో సులభంగా గెలిచే స్థానాలేవి.. కష్టపడితే గెలుపొందేవి ఏవి.. పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల ఏం చేయాలి.. కొత్త మునిసిపాలిటీల్లో పరిస్థితి ఏమిటి..అనే అంశాల వారీగా నివేదికలు కోరినట్లుగా తెలుస్తోంది. దీంతో..ఈ సర్వే సంస్థల ఆధారంగానే అభ్యర్ధుల ఖరారు దగ్గర నుండి ప్రచార వ్యూహాలు అమలు చేసే యోచనలో పార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం.