బీజేపీ విజ్ఞప్తికి టీఆర్ఎస్ ఓకే.. లింగోజిగూడలో పోటీకి దూరం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నిక ఏకగ్రీవం కోసం పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. బీజేపీ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజిగూడ నుంచి గెలిచిన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణస్వీకారం చేయకుండానే మరణించారు.
ఈ స్థానానికి ఏప్రిల్ 30వ తేదీన ఉపఎన్నిక జరుగనుంది. రమేష్ గౌడ్ కుమారుడు బీజేపీ తరపున పోటీ చేస్తున్నందున ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను బీజేపీ నేతలు కోరారు. మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ తో సమావేశమైంది.
సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆకుల రమేష్ గౌడ్ సతీమణి, కుమారుడు, ఇరుపార్టీల నేతలు పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం చేయకుండానే ఆకుల రమేష్ గౌడ్ మరణించడం ఎంతో బాధాకరమని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ విజ్ఞప్తిని పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఒప్పుకున్నారని.. సీఎం సూచన మేరకే పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
మానవతా దృక్పథంతో ఆలోచించి బీజేపీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినందుకు కేసీఆర్, కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మానవతా దృక్పథంతో ఆలోచించి బీజేపీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినందుకు కేసీఆర్, కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 56 సీట్లు రాగా, 48 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. 44 స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండు సాట్లే వచ్చాయి.