తెలంగాణ అభివృద్ధి కోసం మరో ఉద్యమం: కెసిఆర్కు కోదండ షాక్, 'ఎన్డీయేలో చేరం'
హైదరాబాద్/న్యూఢిల్లీ: నిన్నటి దాకా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించామని, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం మరో ఉద్యమం చేసేందుకు అంతా సిద్ధం కావాలని రాజకీయ ఐక్య కార్యచరణ సమితి ఛైర్మన్ కోదండరాం ఆదివారం అన్నారు.
రంగారెడ్డి జిల్లా వికారాబాద్లోని అనంతగిరి హిల్స్లో అనంతగిరి అవలోకనం పేరుతో విద్యావంతుల వేదిక సమావేశం ఆదివారం రెండో రోజు జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేపట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నట్లే అభివృద్ధి కోసం ఉద్యమించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
సమస్యలను ఎప్పటికప్పుడు ఏకరవుపెడుతూ వాటి పరిష్కారం కోసం ఉద్యమించనున్నట్లు చెప్పారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని, ప్రజల భాగస్వామ్యంతోనే ఈ ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఇందుకు సంబంధించిన కార్యచరణను మార్చినాటికి రూపొందించనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం, నిరుద్యోగ సమస్యలతోపాటు, మహిళలపై వివక్ష కొనసాగుతుందోన్నారు. మార్చిలో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
కేంద్రంలో చేరే ఉద్దేశం లేదు: ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి కేంద్రంలో చేరే ఉద్దేశం టిఆర్ఎస్ పార్టీకి లేదని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి శనివారం స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన విజయవంతమైందన్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి కావాల్సినవి సాధిస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు. నారాయణఖేడ్ ఉపఎన్నికల్లో భారీ ఆధిక్యంతో టిఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారన్నారు. 2016-17 బడ్జెట్లో రాష్ట్రానికి కావాల్సిన నిధులు కేంద్రం కేటాయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పలు అంశాలపై ప్రధాని మోడీతో కెసిఆర్ చర్చించారన్నారు.