తెలంగాణ వచ్చే ఏడాదికి: ర్యాంక్స్పై వెంకయ్య, ఏపీకి 2స్థానంపై బాధలేదు కానీ: టీఆర్ఎస్
న్యూఢిల్లీ: పెట్టుబడులకు అనువైన రాష్ట్రాలను ఇటీవల ప్రపంచ బ్యాంక్ విడుదల చేసింది. దీని పైనా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బుధవారం స్పందించారు. ప్రపంచ బ్యాంక్ నివేదిక ఎన్డీయే ప్రభుత్వాల పనితీరుకు నిదర్శనం అన్నారు.
వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్ర ర్యాంక్ మెరుగు అవుతుందని తాను భావిస్తున్నానని వెంకయ్య చెప్పారు. పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్, ఏపీ ముందుండటం సంతోషకరమైన విషయమన్నారు. మిగతా రాష్ట్రాలు పెట్టుబడులను ఇదే రీతిన ఆకర్షించి అభివృద్ధిలో పోటీ పడాలన్నారు.
అసోచామ్ ఆధ్వర్యంలో అందరికీ ఇళ్లు అనే అంశంపై సదస్సు జరిగింది. సదస్సును కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏపీలోని పట్టిసీమ పైన, వరల్డ్ బ్యాంక్ నివేదిక పైన స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోంది ప్రధాని మోడీని కాదని... దేశాన్ని, దేశ అభివృద్ధిని అన్నారు. యూపీఏ హయాంలో తెచ్చిన బిల్లులకే ఇప్పుడు కాంగ్రెస్ అడ్డుపడుతోందన్నారు.
ఇదిలా ఉండగా, ఎన్డీయే పాలిత రాష్ట్రాలకే ప్రపంచ బ్యాంకు నివేదికలో ఉత్తమ ర్యాంకులు వచ్చాయని టిఆర్ఎస్ ఆరోపిస్తోంది. పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉన్న రాష్ట్రాలకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదికపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని తెరాస ఆక్షేపించింది.
ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ర్యాంకులను గమనిస్తే ఎన్డీయే పాలిత రాష్ట్రాలకే ఉత్తమ ర్యాంకులు వచ్చినట్లుగా కనపడుతోందన్నారు. ఎంపీ బూర నర్సయ్య, ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, గాదరి కిషోర్, ప్రభాకర్ రెడ్డిలు వేర్వేరుగా మాట్లాడారు.
ప్రపంచ బ్యాంకు రాష్ట్రాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఏపీకి రెండోస్థానం ఇచ్చారని, వారికి ఉత్తమ ర్యాంకు ఇచ్చినందుకు తాము బాధపడటం లేదని, పరిశ్రమల స్థాపనకు తెలంగాణ ఎంతో అనువైన రాష్ట్రమన్నారు. ఈ విషయాన్ని విస్మరించి 13వ ర్యాంక్ ఆక్షేపణీయమన్నారు.