పోస్టల్ బ్యాలెట్ : దూసుకుపోతున్న టీఆర్ఎస్
కారు - సారు - పదహారు నినాదంతో బరిలో దిగిన టీఆర్ఎస్ గెలుపుపై ధీమాతో ఉంది. ఎన్నికల్లో 16 స్థానాలు తమవేనని అంటోంది. ఇందుకు తగ్గట్లుగానే ఫలితాలు వెలువడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు మెదక్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీఆర్ఎస్ ముందంజలో ఉంది.
సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో మూడు ప్రధాన పార్టీలు బరిలోఉన్నాయి. బీజేపీ జెండా ఎగురుతున్న ఈ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు టీఆర్ఎస్ పక్కా ప్లాన్తో ముందుకెళ్లింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ను ఈ స్థానం నుంచి బరిలో దింపింది. సికింద్రాబాద్ నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ కూడా గట్టి ప్రయత్నాలే చేశారు. అటు బీజేపీ సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయను కాదని మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని రంగంలోకి దింపింది.
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రస్తుతం ఆరు టీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. దీంతో ఆ స్థానం నుంచి గెలుపు నల్లేరుపై నడకేనని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఫలితాలు వెలువడుతున్నాయి.