తెరాసతో టచ్లో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు, తెలంగాణలో అసలు టీడీపీయే లేకుండా కేసీఆర్ ప్లాన్!
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఇప్పుడు శాసన సభలోను టీడీపీ ఊసులేకుండా చేసేందుకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే గెలిచింది.
అదీ ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వర రావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్యలు గెలిచారు. ఇప్పుడు వీరిపై తెరాస కన్నేసింది. వారిని తమ పార్టీలోకి లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్తో వైసీపీ తెరవెనుక ప్రయత్నాలు నిజమేనా: పార్థసారథి ఏం చెప్పారంటే?
శాసన సభలోను టీడీపీ ప్రాతినిథ్యం లేకుండా ప్రయత్నం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88, కాంగ్రెస్ 19, టీడీపీ 2, మజ్లిస్ 7, బీజేపీ ఒక స్థానంలో గెలిచింది. రెండు చోట్ల స్వతంత్రులు గెలిచారు. ఈ స్వతంత్రులు ఇప్పటికే తెరాసలో చేరారు. దీంతో తెరాస బలం 90కి చేరింది. ఇప్పుడు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు, మరికొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన కూడా దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఎమ్మెల్యేల సంఖ్యను సెంచరీ దాటించాలని తెరాస భావిస్తోంది. శాసన సభలోను టీడీపీ ప్రాతినిథ్యం లేకుండా చేయాలని చూస్తోందట.
2014లో గెలిచి తెరాసలోకి క్యూ
2014లో తెరాస నుంచి గెలిచింది కేవలం 63 మంది ఎమ్మెల్యేలే. కాంగ్రెస్ నుంచి 21, టీడీపీ నుంచి 15, బీఎస్పీ నుంచి ఇద్దరు గెలిచారు. ఇందులో ఎక్కువ మంది తెరాసలో చేరారు. కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీల నుంచి ఇరవై ఏడు మందికి పైగా తెరాసలో చేరారు. ఇందులో టీడీపీ నుంచే 13 మంది చేరారు. దీంతో అప్పుడు తెరాస బలం 90కి చేరుకుంది. ఇప్పుడు కూడా ఆ పార్టీ బలం అంతే ఉంది.
తెలంగాణలో టీడీపీకి ప్రాతినిథ్యమే లేకుండా చేయాలని
2014లోలాగే మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా టీడీపీని అసలే లేకుండా చేయాలని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ మందిని చేర్చుకొని దెబ్బతీయాలని చూస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ నుంచి గెలిచిన సండ్ర, మెచ్చలతో తెరాస సీనియర్ నేతలు టచ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ నేతలతో తెరాస నేతలు టచ్లో ఉండటంపై తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ మాట్లాడుతూ... ఎమ్మెల్యేలను లాక్కోవడంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సిద్ధహస్తులని, తమ ఎమ్మెల్యేలతో టచ్లో ఉండటం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదని చెప్పారు.
సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వర రావు
గతంలోనే మెచ్చా నాగేశ్వర రావు తెరాసలో చేరుతారని ప్రచారం సాగింది. ఆయన అమరావతి వెళ్లి చంద్రబాబును కలిశారు. తాను తెరాసలో చేరడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు, 2014లో గెలిచిన సండ్ర, ఇప్పుడు మళ్లీ గెలిచారు. గతంలో టీడీపీ నుంచి గెలిచిన 15 మందిలో పదమూడు మంది తెరాసలో చేరగా, రేవంత్ రెడ్డి ఒక్కరు కాంగ్రెస్లో చేరారు. సండ్ర ఒక్కరే టీడీపీలో ఉన్నారు. కానీ ఈసారి ఆయన తెరాసలోకి వెళ్లే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు. పైగా ఓటుకు నోటు కేసు ప్రభావం కారణంగా ఆయన రూటు మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.