కెకె కూతురు ఔట్: మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు వీరే?
హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఖరారు చేసినట్లు సమాచారం. వారి పేర్లను బుధవారం రాత్రి గానీ గురువారం ఉదయం గానీ ప్రకటించే అవకాశం ఉంది.
మేయర్ పదవి కె. కేశవరావు కూతురు విజయలక్ష్మికి దక్కడం లేదని సమాచారం మేయర్గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్లుగా ఫజుదుద్దీన్, అత్తలూరి విజయలక్ష్మిలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉంటే అత్తలూరి విజయలక్ష్మి కూడా ఉంటారు. లేదంటే డిప్యూటీ మేయర్గా పజదుద్దీన్ పేరును ఖరారు చేస్తారు.
టీఆర్ఎస్ పార్టీ తరుపున మేయర్ అభ్యర్ధిగా ముందుకు వచ్చిన బొంతు రామ్మోహన్ చర్లపల్లి డివిజన్ నుంచి పోటీ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి బొంతు రామ్మోహన్ ముందు నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. హైదరాబాద్ మొత్తం ఏదో విధంగా తన పేరు వినిపించేలా, టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు.
మరోవైపు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కు వచ్చిన సీనియర్ నేత కె. కేశవరావు కుమార్తె విజయలక్ష్మి బంజారాహిల్స్ నుంచి పోటీ చేశారు. ఆమెకు మరో రకంగా సముచిత స్థానం కల్పిస్తారని అంటున్నారు.
ఇదిలావుంటే, జిహెచ్ఎఎంసి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు తాత్కాలికంగా నిలిపేయాలని కాంగ్రెసు నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కోరారు. వారు బుధవారం సాయంత్రం నాగిరెడిని కలిసి ఆ విజ్ఞప్తి చేశారు.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో చాలా అక్రమాలు జరిగాయని, ఈవిఎంల్లో అక్రమాలు జరిగాయని వారు ఫిర్యాదు చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో జరిగిన అక్రమాల వ్యవహారం తేలేవరకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను వాయిదా వేయాలని వారు కోరారు.