ఆనాడు అంజయ్యకు.. ఇప్పుడు కేసీఆర్కు? తెలంగాణకు మోదీ ఘోర అవమానమంటున్న టీఆర్ఎస్...
అటు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ... ఇటు ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన... గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఒకేరోజు సీఎం,పీఎం కార్యక్రమాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అదే సమయంలో ప్రధాని అధికారిక పర్యటనకు సీఎంను దూరం పెట్టడం వివాదాస్పదమవుతోంది. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం రావాల్సిన అవసరం లేదని పీఎంవో కార్యాలయం ప్రత్యేక సమాచారం ఇవ్వడాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. గత సంప్రాదాయాలకు,ప్రోటోకాల్కు తిలోదకాలిచ్చేలా ప్రధాని వ్యవహరించిన తీరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని రాష్ట్ర ప్రభుత్వం,ఆ పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
— Balka Suman (@balkasumantrs) November 27, 2020
పీఎంవో ప్రత్యేక సమాచారం...
శనివారం(నవంబర్ 28) ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పీఎంవో కార్యాలయం కొత్త నిబంధనలు జారీ చేసింది. ప్రధానికి స్వాగతం పలికేందుకు కేవలం ఐదుగురు అధికారులకు మాత్రమే అనుమతినిచ్చింది. ఇందులో హకీంపేట్ ఎయిర్ ఆసిఫ్ చీఫ్,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్,మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి,హైదరాబాద్ డీజీపీ మహేందర్ రెడ్డి,సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికేందుకు రావాల్సిన అవసరం లేదని ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు సమాచారం ఇచ్చారు. ఈ ప్రత్యేక సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం అవాక్కయింది. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని... ఎందుకిలా చేశారని అధికారిక వర్గాలు చర్చించుకుంటున్నారు.
టీఆర్ఎస్ ఏమంటోంది...
ప్రధాని అధికారిక పర్యటనకు రాష్ట్ర సీఎంను రావొద్దని చెప్పడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బకొట్టిన ఢిల్లీ పెద్దలకు తగిన బుద్ది చెబుతామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరించారు. ఆనాడు సీఎం అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించినట్లు ఈనాడు కేసీఆర్ను మోదీ అవమానిస్తున్నారని విమర్శించారు.
అంజయ్యకు జరిగిన అవమానమేంటి..
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు.. స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లిన అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టి.అంజయ్యను ఆయన అవమానించారన్న విమర్శలున్నాయి. టి.అంజయ్య దళితుడు కాబట్టే రాజీవ్ గాంధీ ఆయన్ను అవమానించారని రెండేళ్ల క్రితం బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటులో ప్రధాని మోదీ స్వయంగా అన్నారు. నిజానికి టి.అంజయ్య దళితుడు కాదు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారన్నది పాశం యాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్టులు చెప్పే మాట. ఒకప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ.. సీఎం అంజయ్యను అవమానించారని పార్లమెంటులో మాట్లాడిన మోదీనే.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సీఎంను అవమానించారని టీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. మోదీ ప్రధాని హోదాలో హైదరాబాద్ వస్తున్నారా లేక బీజేపీ నేతగా వస్తున్నారా అని నిలదీస్తున్నారు.
బీజేపీ స్పందిస్తుందా..?
గ్రేటర్ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంటున్న తరుణంలో ఈ వివాదం తెర పైకి రావడం చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ నేతలు ఈ అంశాన్ని తెలంగాణ ఆత్మగౌరవంతో ముడిపెట్టి మాట్లాడుతుండటంతో రాష్ట్ర బీజేపీ నేతలు దీనిపై ఎలా స్పందిస్తారన్న చర్చ జరుగుతోంది. శనివారం(నవంబర్ 28) బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే ఈ వివాదంపై ఇరు పార్టీల మధ్య తారాస్థాయిలో మాటల యుద్దం జరిగే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం.
Recommended Video
మోడీ గారు మీరు చేస్తున్నది ఏంటి ?నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానిస్తున్న మీ డిల్లీ అహంకారానికి తగిన బుద్ది చెబుతారు తెలంగాణ ప్రజలు..తస్మాత్ జాగ్రత్త pic.twitter.com/yk3arLm4rJ
— Balka Suman (@balkasumantrs) November 27, 2020