కూటమి నేతలకు గులాబీ పార్టీ గాలం..! ఇదే మహా మైండ్ గేమ్..!
హైదరాబాద్ : మహా కూటమిలో సీట్ల సర్థుబాటు అనే ప్రహసనం ముగిసింది. ఇక అభ్యర్థులు ఎంపిక కావాల్సి ఉంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తైతే ప్రచారంలో దూసుకెళ్లి అద్రుష్టాన్ని పరీక్షించుకోవాలని ఆశావహులు ఉవ్విళ్లూరుతున్నారు. ఐతే అభ్యర్తుల ఎంపిక ఘట్టానికి ముందే మహాకూటమి నేతలకు షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమిగా ఏర్పడ్డ నాలుగు పార్టీల్లో ఒక పర్టీ నేతలపై అదికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగం చేయబోతోంది. దీంతో టీఆర్ఎస్ ప్రలోభానికి లోనై నేతలు పార్టీ మారితే మహాకూటమి ఆదిలోనే బలహీనపడుతుందనేది అదికార పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. దీంతో అదికార పార్టీ మైండ్ గేమ్ కి ఎవరు లొంగిపోతారనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అదికార పార్టీ మైండ్ గేమ్ ఏ పార్టీ పైన ప్రయోగించబోతోంది..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
మహాకూటమిని నిర్వీర్యం చేయాలి..! అదే అదికార పార్టీ టార్గెట్..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తమదైన ముద్రను చాటుకున్నాయి వామపక్ష పార్టీలు. విభజన తర్వాత ఏపీలో ప్రభావం చూపలేకపోయినా, తెలంగాణలో మాత్రం కొంత మేర తమ మార్కును చూపించగలిగాయి. భావసారూప్యత కనిపించే ఈ రెండు పార్టీలు ప్రస్తుత ఎన్నికల్లో వేరు వేరుగా పోటీ చేస్తున్నాయి. సీపీఎం బీఎల్ఎఫ్ పేరిట ఫ్రంట్ ఏర్పాటు చేయగా, సీపీఐ మాత్రం కాంగ్రెస్, టీడీపీ తెలంగాణ జనసమితి పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసింది. మహాకూటమి లక్ష్యం అదికార గులబీ పార్టీని ఓడించడమే నని మొదటినుండీ ఆ కూటమి నేతలు చెప్పుకొస్తున్నారు. కాని కూటమి నేతలను తమ వైపు తిప్పుకునేందుకు అదికార గులాబీ పార్టీ అనూహ్య రీతిలో ప్రణాళికలు రచిస్తోంది.
తెలంగాణలో ప్రభావం చూపించనున్న సీపీఐ..! ఆ పార్టీపైనే కన్నేసిని టీఆర్ఎస్..!!
ఒంటరిగా పోటీ చేసినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం తప్ప తమకు ఎటువంటి ప్రయోజనం ఉండదని భావిస్తున్న ఆ పార్టీ నేతలు.. తమకు కావాల్సిన సీట్లను తీసుకుని కూటమిలోనే పోటీ చేయాలనుకున్నారు. అందుకే సీట్ల సర్ధుబాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ జాప్యం చేస్తున్నా కూటమిలోనే కొనసాగేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో పలు స్థానాల్లో పోటీ చేసిన సీపీఐ, నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో మాత్రమే విజయం సాధించింది. ఆ పార్టీ తరపున రవీంద్ర నాయక్ గెలిచి తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు.
సీపీఐని దెబ్బకొడితే మహాకూటమి ని కొట్టినట్టే..! ఇదే గులాబీ పార్టీ మాస్టర్ ప్లాన్..!
విభజన అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీపీఐ పార్టీ బలహీనపడింది. ఆ పార్టీలోని ముఖ్య నాయకులు ఎవరికి తోచిన దారి వారు ఎంచుకోవడంతో పార్టీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. మెజారిటీ సభ్యులను తమ పార్టీలో చేర్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి మరికొందరు నేతలపై దృష్టి సారించిందని తెలుస్తోంది. మహాకూటమి బలపడక ముందే దెబ్బ కొట్టాలని భావిస్తున్న ఆ పార్టీ., కూటమిలోని సీపీఐ నేతలపై కన్నేసింది. మిగతా పార్టీల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు ఉండడంతో ఈ పార్టీని ఎంచుకున్నారనే చర్చ జరుగుతోంది.
గులాబీ గాలానికి సీపీఐ చిక్కుతుందా..! మైండ్ గేమ్ తిప్పికొడుతుందా..?
గ్రామాల్లో పట్టున్న కమ్యూనిస్టులను మచ్చిక చేసుకుంటే ఎంతో కొంత ఓటు బ్యాంకు తమ ఖాతాలో పడుతుందని భావిస్తున్న టీఆర్ఎస్ నేతలు వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. దీనికి తోడు ఆ పార్టీ నేతలను చేర్చుకుంటే సీపీఐను మానసికంగా దెబ్బకొట్టి, మహాకూటమికి షాక్ ఇవ్వచ్చనేది టీఆర్ఎస్ టార్గెట్ గా తెలుస్తోంది. మహాకూటమి వల్ల తమకు సీట్లు దక్కవని భావిస్తున్న సీపీఐ నాయకులు టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేతలను తమవైపు తిప్పుకుని కూటమిని మానసికంగా దెబ్బతీయాలని అదికార గులాబీ పార్టీ వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోంది. అదికార పార్టీ ప్రణాళిక పక్కాగా అమలైతే కూటమిలో కొంత మేర కుదుపు తప్పదనే చర్చ రాజకీయ పార్టీలో నడుప్తోంది.