పారాహుషార్: విపక్ష స్థానాలపై నజర్.. ముందు సర్వే.. ఆపై కేటీఆర్, కవితలతో సభలు.. ఇదీ టీఆర్ఎస్ ప్లాన్
హైదరాబాద్: తెలంగాణలో పట్టు మరింతగా పెంచుకునే దిశగా అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. అందుకోసం విపక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పటిష్ఠంపై దృష్టి సారించింది. కీలక నియోజకవర్గాల్లో రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో సభలు, సమావేశాలు నిర్వహించడం ద్వారా ఆయా స్థానాల్లో పార్టీని బలోపేతం చేయాలని టీఆర్ఎస్ యోచిస్తున్నది.
అందులో భాగంగా ముందుగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహించి, ప్రజలకు చేరువయ్యేందుకు అవసరమైన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. ముందుగా హైదరాబాద్లోని గోషామహల్ నియోజకవర్గం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎన్నికైన రాజాసింగ్ అధికార పక్షానికి సవాల్గా పరిణమించారు. దీంతో గోషామహాల్ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ కీలకంగా భావిస్తోంది.
గోషా మహాల్ యువతలో రాజాసింగ్పై క్రేజ్
సంచలన వ్యాఖ్యల ద్వారా ప్రజలకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్న రాజా సింగ్ పట్ల ఆయన సొంత పార్టీలోనే మద్దతు లభించడం లేదు. కానీ గోషా మహాల్ నియోజకవర్గ యువతకు ఆయన అంటే మంచి గురి ఉన్నట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆయనకు సరైన గుర్తింపు ఇవ్వకున్నా, వివిధ సామాజిక వర్గాలు నిర్వహించే ప్రధాన కార్యక్రమాలకు హాజరవుతూనే ఉన్న రాజా సింగ్ ఇటీవల ‘పద్మావతి' సినిమాను విడుదల చేయొద్దని వార్తల్లోకి ఎక్కారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంపై ఆందోళనలు చేయడంలో మిగతా విపక్ష ఎమ్మెల్యేల మాదిరిగానే ఆయన కూడా ముందు ఉన్నారు.
ఇలా కార్యాచరణ చేపట్టిన టీఆర్ఎస్
గత రెండేళ్లుగా ఈ నియోజకవర్గం సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఎలాగైనా గెలవాలనే భావనతో విస్తృతస్థాయి సర్వేకు పూనుకుంది. టీఆర్ఎస్ అధిష్ఠానం ఇప్పటికే మూణ్నెల్లకోసారి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు జరిపింది. వాటికంటే మరింత లోతుగా తాజా సర్వే చేపట్టింది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, గోషామహల్ ఇన్ఛార్జి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో సర్వే జరిగింది. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు 40 శాతానికి పైగా ప్రజాదరణ ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. నియోజకవర్గంలోని కొన్ని సమస్యలు వెల్లడయ్యాయి. పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో శ్రీనివాస్రెడ్డి సమావేశమై కార్యాచరణ ప్రారంభించారు. సర్వే ప్రాతిపదికగా ఇంటింటికి తెరాస కార్యక్రమాన్ని ప్రారంభించాలని, మంత్రి కేటీఆర్, ఎంపీ కవితలతో రెండు బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు.
టీఆర్ఎస్ ఇన్ చార్జీల ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఇలా
రాష్ట్రంలో 29 నియోజకవర్గాల్లో విపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రత్యేకించి ఖమ్మం జిల్లా మధిరలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, నల్లగొండలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, అసెంబ్లీలో విపక్ష నేత కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి, వరంగల్ జిల్లాలో నర్సంపేటలో మాధవరెడ్డి, రంగారెడ్డి జిల్లాలో పరిగిలో రామ్మోహనరెడ్డి, గద్వాల జిల్లాలో డీకే అరుణ, సంపత్ కుమార్ ఆయా నియోజకవర్గాల్లో పాగా వేసే లక్ష్యంతో పార్టీ అధిష్ఠానం వ్యూహరచన చేసింది. ముందుగా పార్టీ బలాబలాలు తెలుసుకునేందుకు విస్తృత స్థాయిలో సర్వేలు నిర్వహించి, అందులో సానుకూల, ప్రతికూలాంశాలను తెలుసుకోవాలని భావించింది. పార్టీ తరఫున రాష్ట్ర కార్యవర్గం నుంచి ఇన్ఛార్జులు నియమితులైన వారు బాధ్యతలు నిర్వహించాలని ఆదేశించింది.
డబుల్ బెడ్రూం, మిషన్ భగీరథ అమలుపై ఇలా
జగిత్యాలలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టినట్లు సమాచారం. జగిత్యాల అసెంబ్లీ స్థానంపై ప్రత్యేక ద్రుష్టి సారించిన కల్వకుంట్ల కవిత.. డబుల్ బెడ్ రూం పథకం, మిషన్ భగీరథ తదితర కీలక పథకాల అమలుపై నిరంతరం ఆమె సమీక్షలు చేయడంతోపాటు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారని వినికిడి. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని ఆమె తలపోస్తున్నట్లు సమాచారం. ఈ వెలుగులోనే జగిత్యాల అసెంబ్లీ స్థానంపై కేంద్రీకరించారని చెప్తున్నారు. ఇంకా మల్లు భట్టి విక్రమార్క, హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి, నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, జహీరాబాద్లో గీతారెడ్డి వారిని లక్ష్యంగా చేసుకుని అధికార టీఆర్ఎస్ కార్యక్రమాలు చేపట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.