టీఆర్ఎస్ దొంగలు ఎంతకైనా తెగిస్తారు, నేరచరిత్ర ఉన్నవారికే ఆ పార్టీ టికెట్లు: రేవంత్ రెడ్డి
తెలంగాణ మున్సిపల్ పోరు ప్రచారానికి రేపటితో తెరపడనుంది. దీంతో ప్రధాన పార్టీలు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. తమను గెలిపిస్తే, అదీ చేస్తాం, ఇదీ చేస్తాం అంటూ ఊదరగొడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో ప్రధానంగా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ ముఖ్యనేత రేవంత్ రెడ్డి ఆదివారం ప్రచారం నిర్వహించారు.
జర జాగ్రత్త..
మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ నేతలు ఎంతకైనా తెగిస్తారని రేవంత్ రెడ్డి శ్రేణులను హెచ్చరించారు. ఆ టీఆర్ఎస్ దొంగలు గెలవడానికి ఎంతకైనా బరితెగిస్తారని మండిపడ్డారు. జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలకు సజెస్ట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను బెదిరించే వారిని వదిలిపెట్టబోమని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వారి భరతం పడతామని శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
నేరచరిత్ర..
మున్సిపల్ ఎన్నికల్లో నేరచరిత్ర ఉన్నవారికే టీఆర్ఎస్ పార్టీ టికెట్లు కేటాయించిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీలో సచ్చిలురు ఎవరూ లేరని, భూతద్దాం పెట్టుకొని చూసినా కనిపించరని విమర్శించారు. బండారి లేఔట్ వర్షాలతో మునిగిపోతే ప్రభుత్వం పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఈ ప్రభుత్వానికి ప్రజల సాధక బాధలు పట్టవని ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి
పేదలకు సొంత ఇళ్లు అందించాలనే ఉద్దేశంతో రాజీవ్ గృహకల్పను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. గృహకల్పతో పేదలు, మధ్యతరగతి వారి సొంతింటి కల సాకారమైందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తామని చెబుతోన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను ఎప్పుడు పూర్తిచేస్తోందో ఆ భగవంతుడికే తెలియాలన్నారు. 20వ తేదీతో సాయంత్రంతో ప్రచారం ముగియనుండగా.. ఈ నెల 22వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 25వ తేదీన ఓట్లను లెక్కించి, ఫలితాలను ఎన్నికల అధికారులు వెల్లడిస్తారు.